రాజోళి, మార్చి 5 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం పచ్చర్లకు చెందిన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు గ్రామంలో చదువు అభ్యసించిన అనంతరం మాన్దొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8నుంచి 10వ తరగతి వరకు చదువుకునేందుకు 70 మంది వరకు విద్యార్థులు వెళ్లారు. పచ్చర్ల నుంచి మాన్దొడ్డి వెళ్లేందుకు 7కిలోమీటర్ల దూరం ఉండగా, ఉదయం 10గంటలకు రావాల్సిన ఆర్టీసీ బస్సు 11:30గంటలకు వస్తున్నది.
ఒక్కోసారి బస్సు రాకపోకవడంతో కొందరు కాలినడకన వెళ్తుండగా, మరికొందరు చేసేది లేక బైక్లు, ఇతర వాహనాలను లిఫ్ట్ అడిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో చేసేది లేక కొన్నాళ్లుగా గ్రామస్తులు ట్రాక్టర్ ద్వారా విద్యార్థులను తరలిస్తున్నారు. సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని గద్వాల డిపో మేనేజర్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రెగ్యులర్గా బస్సు నడిపించాలని కోరుతున్నారు.