కొల్లాపూర్, డిసెంబర్ 22 : ఈ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను దృష్టికిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వంలో మూడు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్ పట్టణానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించారు. పట్టణంలోని రాణి ఇందిరాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కొన్ని గదుల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన తరగతులను ప్రారంభించారు. అకాడమిక్ సంవత్సరం ప్రారంభమైన మూడు నెలలు దాటిన తర్వాత కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు చేపట్టారు. అప్పటికే పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులే ప్రవేశం పొందారు. విద్యార్థులకు తరగతులు ప్రారంభమై మూడు నెలలు దాటాక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కారణంగా విద్యార్థులకు సరిపోను తరగతి గదులు, భవనం, ల్యాబ్లేటరీలు లేవన్న సాకుతో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మోజర్ల యూజీ కాలేజీలోకి శుక్రవారం మధ్యాహ్నం ఫర్నీచర్ను అధికారులు తరలించారు. ప్రస్తుతం ఈ కాలేజీలో విద్యాభోదన చేస్తున్న 8మంది విద్యార్థులకు తాత్కాలిక తరగతులు, భవనం ఉన్నప్పటికీ కావాలనే కుట్రతోనే మోజర్లకు కళాశాలను తరలించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు డి.శేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తారాసింగ్, ఏబీవీపీ నాయకుడు శివకృష్ణ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కళాశాలను మోజర్లకు తరలించారని ఆయా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అలాగే 2017లో వీపనగండ్ల మండల కేంద్రం నుంచి వసతులు లేవన్న కారణంగా ఎస్సీ గురుకుల పాఠశాలను కొత్తకోటకు అధికారులు తరలించారు.
తాత్కాలికంగానే కళాశాల తరలింపు..
కొల్లాపూర్లో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలకు సరిపోను భవనం, తరగతి గదులు, ల్యాబ్లేటరీ వసతులు లేని కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మోజర్లకు తాత్కాలికంగా తరలించాం. కొల్లాపూర్లో భవనం, వసతులు ఏర్పాటైన తర్వాత తిరిగి ఇక్కడే కళాశాలను కొనసాగిస్తాం.
– రాజశేఖర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్