‘వీఆర్ఏల జీవితం ధన్యమైంది.. మమ్మల్ని రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.. తెలంగాణలో మాకు మంచిరోజులు వచ్చాయి.. ప్రభుత్వం ఊహించినదానికంటే ఎక్కువే చేసింది.. ఇన్నాళ్లకు మా కష్టానికి ఫలితం దక్కింది.. చదువుకు తగ్గట్టు ఉద్యోగం, పేస్కేల్ అందించడం సంతోషంగా ఉన్నది.. మా కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి సాయం మరువలేనిది.. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయే తప్పా మాకు గుర్తింపునివ్వలేదు’ అని వీఆర్ఏల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులుగౌడ్, జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు. మంగళవారం ‘నమస్తే’తో వారి ఆనందాన్ని పంచుకున్నారు.
– మహబూబ్నగర్/గద్వాల, జూలై 25
మహబూబ్నగర్, జూలై 21 : గ్రామ రెవెన్యూ సహాయకులు తెలంగాణ ఏర్పాటు కాకముందు వరకు వారబందీ విధానంలో అమలులో ఉండేది. ఈ విధానానికి స్వస్తి పలికి నూతన విధానాలకు శ్రీకారం చుట్టాలని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. వారబందీ విధానం వల్ల ప్రతి గ్రామంలో ఎన్నో గొడవలై పీఎస్లల్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. పక్కా ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిర్ణయించుకున్నది. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చర్యలు తీసుకోవడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
2012లో డైరెక్ట్ రిక్రూంట్మెంట్ (గ్రూప్-4 పరీక్ష) ద్వారా 480మంది ఉమ్మడి జిల్లాకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,800మంది వీఆర్ఏలు ఉన్నారు.
ఈ సందర్భంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసులుగౌడ్ ‘నమస్తే తెలంగాణ’తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ: మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని అనుకున్నారా?
శ్రీనివాసులుగౌడ్ : అస్సలు అనుకోలేదు. ఏదో కొంత వరకు మేలు చేస్తారనుకున్నాం. మేమెవరం ఊహించని స్థాయిలో మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుందని అనుకోలేదు. మాకు ఇంత మేలు చేసిన సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నాం.
నమస్తే: మూడు కేటగిరీల్లో అందరికీ న్యాయం చేయడంపై మీ అభిప్రాయం?
శ్రీనివాసులుగౌడ్ : వీఆర్ఏలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పీజీ చేసిన వారు, ఏమీ చదువుకోని వారితో కలిసి పనిచేశారు. వారబందీ ద్వారా కొందరూ పనిచేసే వారు. ఈ విధానాలకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతూ మూడు కేటగిరీలుగా అందరికీ న్యాయం చేశారు.
నమస్తే: వయస్సు పైబడిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇచ్చారు కదా? వారేమంటున్నారు?
శ్రీనివాసులుగౌడ్ : 65-70 ఏండ్ల వయస్సు ఉన్న వారు కూడా వీఆర్ఏలుగా పని చేసిండ్రు. వయస్సు పైబడడంతో వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడంలో లీగల్ ఇబ్బందులు లేకుండా జీవోను జారీ చేయడం కేవలం సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యం. మా సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడంలేదు.
నమస్తే : చదువుకు తగ్గట్టు ఉద్యోగం, పేస్కేల్ ఇవ్వడంపై మీ అభిప్రాయం?
శ్రీనివాసులుగౌడ్ : వీఆర్ఏలలో చాలామంది పీజీతోపాటు పైచదువులు చదివిన వారు ఉన్నారు. కొందరు డిగ్రీ, ఇంటర్, పదో తరగతి చదివారు. వారందరకీ సముచిత స్థానం కల్పిస్తూ విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం సంతోషకరం. అలా చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. అందరూ సంతోషంగా ఉన్నారు.
కష్టానికి ఫలితం దక్కింది
గద్వాల, జూలై 25 : వీఆర్ఏలు ఎన్నో ఏండ్లుగా తక్కువ జీతానికి పని చేశారు. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నారే తప్పా మమ్మల్ని గుర్తించలేదు. గ్రామాల్లో ప్రతి పనికి వీఆర్ఏలను వినియోగించుకోగా ప్రభుత్వం ఇచ్చే జీతం మాత్రం సరిపోయేది కాదు. వచ్చే అరకొర జీతంతో కుటుంబాలను పోషించాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీఆర్ఏలకు గుర్తింపు లభించింది. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు గౌరవ వేతనం ఇచ్చారు. ఆ తర్వాత పేస్కేల్ అమలు చేశారు. ఇప్పుడు విద్యార్హతను బట్టి జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు ఎంపిక చేస్తూ జీవో విడుదల చేశారు. మా కష్టానికి సీఎం కేసీఆర్ కరుణతో ఫలితం దక్కింది. తెలంగాణ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది. ఇన్నాళ్లు చేసిన కష్టం వృథా కాలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా కుటుంబాల్లో వెలుగులు నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు మా వీఆర్ఏలతోపాటు మా కుటుంబాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయి.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ఎన్నో ఏండ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తూ వచ్చాం. మా పని భారం, కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాకు పేస్కేల్ ఇస్తూ మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. వీఆర్ఏలమంతా తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మాకు న్యాయం చేసి మా కుటుంబాలకు కేసీఆర్ సార్ భరోసానిచ్చారు. ఆయన మేలు మేము జీవితంలో మరువం.
– దుర్గాప్రసాద్సాగర్, వీఆర్ఏల జేఏసీ నాయకుడు, కొల్లాపూర్
నిజాం కాలం నుంచి వెట్టిచాకిరీ చేసినం..
నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు వెట్టిచాకిరీ చేసినం. ఊర్లళ్ల ప్రతీది మాకే చెప్పేటోళ్లు. అన్నీ మేమే చేసేటోళ్లం. ఈ కాలంలో పని ఎక్కువైంది. రోజురోజుకూ పనిభారం పెరుగుతూ వచ్చింది. ఏండ్లసంది మా కష్టాలను చెప్పుకుంట వచ్చినం. ఇన్నేండ్లకు మమ్మల్ని గుర్తించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆత్మగౌరవంతో బతుకుతం. వీఆర్వోల వ్యవస్థ రద్దు చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పిండు. సార్ ప్రకటనతో ఏండ్ల కష్టానికి ప్రతిఫలం దొరికినట్లయ్యింది. మండలంలో మొత్తం 37మంది వీఆర్ఏలం ఉన్నం. అందరం పట్టలేని సంతోషంతో ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– బి.శ్రీనివాసులు, జేఏసీ నాయకుడు, ఆత్మకూరు