పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి రథాన్ని లాగి తన్మయత్వం చెందారు. తేరు ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. యాదాద్రి, వేములవాడ, సమ్మక్క-సారక్క వంటి ఆలయాల సరసన నిలుపుతామన్నారు.
పాలమూరు, ఫిబ్రవరి 6 : సమైక్య రాష్ట్రంలో మన్యంకొండ ఆలయ అభివృద్ధిని విస్మరించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాతే పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి ప్రాధాన్యత పెరిగిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. 800 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవాన్ని ఆదివారం అర్ధరాత్రి కనులపండువగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి తన్మయత్వం చెందారు. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మన్యంకొండ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారన్నారు. పది లక్షల మొక్కలు నాటి ఆలయ, అటవీ భూములను కాపాడుకుంటామని, ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రకృతి సిద్ధమైన మన్యంకొండ ఆలయాన్ని భవిష్యత్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. యాదాద్రి, వేములవాడ, సమ్మక్క-సారక్క వంటి ఆలయాల సరసన మన్యంకొండను నిలుపుతామన్నారు. వచ్చే ఏడాది నాటికి తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వేను ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం మన్యంకొండలో వసతిగృహంతోపాటు, వందలాది పెండ్లిళ్లు నిర్వహించుకునేలా షెడ్లు నిర్మించామన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నానన్నారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన కళాకారులను మంత్రి అభినందించారు. అంతకుముందు స్వామివారి గరుడవాహన సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ కే.నరసింహ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఏఎస్పీ రాములు, మన్యంకొండ ఆలయ ధర్మకర్త మధుసూదన్కుమార్, డీఎస్పీ మహేశ్, సమాచార శాఖ జిల్లా ఏడీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ, రూరల్, హన్వాడ మండలాధ్యక్షులు శివరాజు, శ్రీనివాస్ యాదవ్, కరుణాకర్ గౌడ్, నాయకులు రాఘవేందర్ గౌడ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, సిబ్బంది మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, ఈవో శ్రీనివాసరాజు, పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.