శ్రీశైలం నవంబర్ 24 : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీకమాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మా ర్మోగుతుంది. కార్తీకమాసం ఆఖరివారం కావడంతోపాటు వా రాంతపు సెలవులు కలిసిరావడంతో కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు నిర్వహించారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతూ ఉన్నందున రద్దీ రోజులలో స్వామి వారి గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేసి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అమ్మవారి అంతరాలయంలో జరిపించే కుంకుమార్చనలు కూడా ప్రాకార మండపంలోనే నిర్వహిస్తుండగా యాత్రికులు ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో కోరారు.
ఆదివారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయాణమైన వాహనాలతో సుమారు 10 కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్ రహదారివైపు నిలిచిపోయిన వాహనాలు క్లియర్ అవ్వడానికి నాలుగు గంటల సమయం పట్టింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. టోల్గేట్ నుంచి వలయ రహదారి గుండా నిర్ణీత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా సూచించారు. క్షేత్ర పురవీధుల్లోకి ప్రవేశించి అడ్డగోలుగా పార్కింగులు చేసి యాత్రికులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేలా పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నట్లు శ్రీశైలం సీఐ తెలిపారు.