సర్కార్ బడులకు మహర్దశ పట్టిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి ప్రాథమిక పాఠశాల, కిచెన్షెడ్తో పాటు కొన పాలమూరు ఉర్దూ మీడియం పాఠశాలలను కలెక్టర్ రవితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు, సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.
పాలమూరు, ఫిబ్రవరి 3: మన ఊరు- మనబడి కార్యక్రమంలో సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మారుతున్నాయని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కొనపాలమూరు ఉర్దూమీడియం ప్రాథమిక పాఠశాలలో రూ.23.64లక్షలతో చేపట్టిన పనులతోపాటు రామయ్యబౌళిలో రూ.45లక్షలతో నిర్మించిన పాఠశాల, కిచెన్ షెడ్డును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రతిభ కల్గిన ఉపాధ్యాయులు ఉంటారని.. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇక్కడి నుంచే వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
దేశంలో ఇంత మొత్తంలో గురుకులాలు ఏర్పాటు చేసిన రాష్ట్రం మరేదీలేదన్నారు. పాఠశాలలను అన్ని వసతులలో తీర్చిదిద్దేందుకు మంచి విద్యతోపాటు, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉన్నదన్నారు. వచ్చే సంవత్సరంలో విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ జిల్లాలోని 291 పాఠశాలలో మన ఊరు-మనబడి కింద అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అన్ని వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు సమానంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ కే నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, డీఈవో యాదయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఎంఈవో జయశ్రీ, ఇతర అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.