మహబూబ్నగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించ తలపెట్టిన రోప్వే పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పర్యాటక శాఖ చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ, కోల్కత్తా, ముంబైకి చెందిన రోప్వే నిపుణులతో కలిసి రోప్వే పనులకు సంబంధించిన స్థలాన్ని గురువారం మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండ దిగువన ఉన్న అలివేలు మంగ ఆలయం, మెయిన్ రోడ్డుకు కుడి వైపు నుంచి కొండపైకి సుమారు ఒక కిలోమీటర్ మేర రోప్వే నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రోప్వే వల్ల పర్యాటకులు, భక్తుల సంఖ్య పెరుగుతుందని, అందుకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎంత ఖర్చు అయినప్పటికీ మన్యంకొండను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మన్యంకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మధుసూదన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల కార్యదర్శి శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకూ ఆర్థిక చేయూత
మహబూబ్నగర్ అర్బన్, మార్చి 23 : అన్ని వర్గాల ప్రజలకు దళితబంధు తరహాలో దశలవారీగా ఆర్థిక చేయూతనందిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో (డిక్కీ) ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రంగం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు ‘ఉద్యోగ, వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై గురువారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డిక్కీ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవికుమార్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులాలే వృత్తులుగా మారాయన్నారు. ఉత్పత్తి కులాలు రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటి సారిగా సాహు మహరాజ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారన్నారు. జ్యోతిరావుఫూలే స్ఫూర్తితో రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ దఫాలో ప్రతి నియోజకవర్గానికి దళితబంధు కింద 1,100 యూనిట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
నియోజకవర్గానికో కో ఆర్డినేటర్ను ఏర్పాటు చేసి దళితబంధు పంపిణీ చేస్తామన్నారు. గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు డిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దళితులు ఆత్మన్యూనతా భావం వ దిలి అందరితో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, కౌన్సిలర్ నర్సింహులు, నాయకులు రవికుమార్, ప్రణీల్చందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.