మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉంటామన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కందూరు స్టేజీ సమీపంలో నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి హాజరవగా.. భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అర్హులకు అందేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కాంతులీనుతుండగా.. ప్రగతి పరుగులు పెడుతున్నదని తెలిపారు. ప్రభుత్వ హయాంలో జరిగే మంచి పనులను ప్రజలకు వివరించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్వన్గా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అడ్డాకుల, మే 28 : సీఎం కేసీఆర్ ఆశీస్సుల తో మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్వన్గా నిలుపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దేవరకద్ర నియోజకవకర్గంలోని అడ్డాకుల మండలంలోని బీ ఆర్ఎస్ కార్యకర్తలతో కందూరు స్టేజీ వద్ద ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రజల అండదండలతోనే అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 65 వేల మందికి రైతుబంధు అందుతున్నదని, సుమారు రూ.వెయ్యి కోట్లు ఖాతాలో జమచేశామన్నారు. గతంలో ఒక్క జిల్లాకు కూడా ఇన్ని నిధులు వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతుబంధు, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, రైతుబీమా ద్వారా వందల కోట్లను ఒక్కో నియోజకవర్గానికి కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి పాలనలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని.., నేడు కేవలం గంటన్నరలోనే హైదరాబాద్కు చేరుకునేలా రహదారులను నిర్మించుకున్నామన్నారు. వాగులు, వంకలపై ఎన్నో చెక్డ్యాంలు ఏర్పాటు చేశామని, ఇంకా తొమ్మిది ఆనకట్టలకు నిధులు మంజూరయ్యాయన్నారు. జిల్లా వాసులు వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా మహబూబ్నగర్లో వెయ్యి పడకలతో కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని ప్రారంభించామన్నారు.
30 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలు పాలమూరుకు వస్తున్నాయన్నారు. పరిశ్రమలు, తాగు, సాగునీటి రాకతో ప్రజలు సంతోషంగా బతుకుతుంటే ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయన్నారు. తెలంగాణను ఆగం చేసేందుకు కొంత మంది నాయకులు పనిగట్టుకొని వస్తున్నారని, వారిని నమ్మొద్దని కోరారు. ఈ తొమ్మిదేండ్లల్లో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. 2014కు ముందు ఎకరం భూమి రూ.3 లక్షలు మించకుండె.. నేడు రూ.30లక్షలు పెట్టినా ఎకరా కూడా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో నాటు వేయడానికి రూ.50 ఇచ్చేవారని, పది మంది కంటే ఎక్కువ కూలీలు వస్తే వెనక్కి పంపేవారన్నారు. ఇప్పుడు చేతి నిండా పని ఉండడంతో రూ.500 నుంచి రూ.వెయ్యి ఇచ్చినా కూలీలు దొరకడం లేదన్నారు. కూలీలకు గౌరవం కల్పించిన ఘనత తమదేనన్నారు.
గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు సుట్టపుసూపుగా వచ్చేవారని, హైదరాబాద్కు వెళ్లినా కలిసేవారు కాదని, నేడు ప్రజాప్రతినిధులంతా 24 గంటలపాటు అందుబాటులో ఉంటున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నిరంతరం పాటుపడుతున్నారని, తమను ఎప్పుడు కలిసినా ఏదో ఒక వినతి ఇస్తున్నారన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా.. ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటానన్నారు. అడ్డాకుల.. తన సొంత మండలమని, రాచాల సొంత గ్రామమని.. అందుకే మండలానికి మినీ స్టేడియం మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. గొప్ప విజన్ ఉన్న నాయకుడని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. 75 ఏండ్ల కిందట ఏర్పడిన రాష్ర్టాల కంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందని ఎవరూ అనుకోలేదని, కానీ నేడు ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద 12 వేల మంది లబ్ధి పొందారన్నారు. ఉమ్మడి పాలనలో ముఖ్యమంత్రులు తమ జేబులు నింపుకొన్నారే తప్పా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తెలంగాణ రాకపోతే రైతుబంధు వచ్చేదా? కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష వచ్చేదా? రూ.2వేల ఆసరా పింఛన్ వచ్చేదా? తాగు, సాగునీరు వచ్చేదా? అని ప్రశ్నించారు.
ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి గడపకూ లెక్కలేనన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఇక్కడి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవో ఆ పార్టీల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రచ్చకట్టల వద్ద సంక్షేమ పథకాల గురించి చర్చ జరగాలన్నారు. ఎంజీకేఎల్ఐ కింద కాల్వ ద్వారా కందూరువాగు మీదుగా సరళాసాగర్ వరకు కృష్ణాజలాలను తీసుకెళ్లామన్నారు. అంతదూరం నీళ్లెలా తీసుకెళ్తారని ప్రతిపక్షాలు విమర్శించాయని, సీఎం కేసీఆర్ పట్టుదలతో రూ.వందల కోట్లు వెచ్చించి ఖిల్లాఘణపురం బ్రాంచ్కెనాల్ ద్వారా కందూరు వాగుకు నీళ్లు మళ్లించామన్నారు. ముఖ్యమంత్రి.. అపర భగీరథుడిలా మారాడన్నారు. నాడు 16 బోర్లు వేసినా చుక్క నీళ్లు కూడా పడని దుస్థితి నుంచి.. బోర్ల నుంచి కరెంట్ లేకుండానే నీరు ఉబికి వచ్చే స్థితికి చేరుకున్నట్లు వివరించారు.
రెండు కిలోమీటర్లకు ఒక చెక్డ్యాం నిర్మించామన్నారు. నియోజకవర్గంలో 21 ఆనకట్టలతో సుమారు 25 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చిందన్నారు. చెక్డ్యాంలకు కాల్వలు తవ్వి పొన్నకల్, రాచాల చెరువులను నింపామన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆటపాటలు ఆకట్టుకోగా.. మహిళలు స్టెప్పులేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, విద్యాసాగర్, ఎంపీపీ నాగార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, నాయకులు రాజు, జితేందర్రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.