అయిజ, ఏప్రిల్ 16 : వడదెబ్బకు తనయుడు మృతి చెందగా, పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి రోదిస్తూ కుప్పకూలి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని తూంకుంట గ్రామంలో చోటు చేసుకొన్నది. గ్రామస్తుల కథనం మేరకు.. అయిజ మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (42)కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై పొలంలోనే కుప్పకూలాడు. వెంటనే గ్రహించిన కుటుంబ సభ్యులు అయిజకు తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుని భౌతికాయాన్ని గ్రామానికి తరలించగా, కల్లెదుటే కన్న కొడుకు మృత్యువాత పడటంతో శోకసంద్రంలో మునిగి రోదిస్తూ తల్లి రంగమ్మ (63) కుప్పకూలి పడిపోయింది.
వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు వైద్యులతో పరీక్షించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లి, తనయుడు భౌతికకాయాలను చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు. రోజు రోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో రైతులు, ప్రజలు అల్లాడి పోతున్నారు. వ్యవసాయ పనులు చేసుకొనేందుకు రైతులు జంకుతున్నారు. యాసంగి పంటలు చేతికొచ్చే వేళ పనులకు వెళ్లిన రైతులు ఇంటికి చేరుకొనే వరకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. గ్రామంలో ఇలాంటి సంఘటనలు మునుపెన్నడూ చోటు చేసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతుల ఇంటికి చేరుకొని కుటుంబాలను పరామర్శిస్తున్నారు.
అయిజ మండలంలోని తూంకుంట గ్రామంలో వడదెబ్బకు మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకునేందుకు కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. అంతకుముందు ఆయన మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేత రఘునాథరెడ్డి, సర్పంచ్ కృష్ణారెడ్డి ఉన్నారు.