మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 24 : తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల కు గౌరవం పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న క్యాంప్ కార్యాలయంలో గురువారం మ హబూబ్నగర్ రూరల్, హన్వాడ మండలాల్లోని సెర్ప్ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇక్కడికి వచ్చి సంఘాల భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్లు తీసుకోవడంతోపాటు అభిమానంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
మహబూబ్నగర్ రూరల్, హన్వాడ మండలాల మహిళా గ్రూపులకు ఇప్పటివరకు రూ.235 కోట్లను బ్యాంకు ఖాతాలో జమచేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. పుష్కలం గా సాగునీరు ఉండడంతో ఎటు చూసి నా పచ్చదనం కనబడుతుందని, ఫలితం గా భూముల ధరలు పెరిగాయన్నారు. గతంలో కూలీలకు రూ.50 ఇచ్చేవారని, ఇప్పుడు రూ.500 నుంచి రూ.700కు పెరిగిందన్నారు. రూ.200 ఉన్న ఆసరా పింఛన్ను రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 అందిస్తున్నామన్నారు.
జిల్లా జనరల్ దవాఖానలో అన్ని రకాల వై ద్య పరీక్షలు చేసేందుకు పరికరాలు సమ కూర్చామన్నారు. స్థానికంగా ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలన్న ల క్ష్యంతో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నట్లు చెప్పా రు. స్థానికంగానే ఐటీ కొలువులు లభిం చే స్థాయికి ఎదిగామన్నారు. పది వేల మందికి ఉద్యోగాలను కల్పించే లిథియం గిగా పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. భవిష్యత్లో హన్వాడ ఫుడ్పార్కుతోపా టు మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యు వతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయనికి మూడు గంటల కరెంటు చాలంటున్నాడని.. అది ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.
కాం గ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని, రూ.2 వేల ఆసరా పిం ఛన్ కూడా లేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పేందుకు ఇతర పార్టీల నా యకులు వస్తుంటారని, వారితో జాగ్రత్త అని సూచించారు. అనంతరం డీఆర్డీ ఏ, సెర్ప్ ఉద్యోగులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీలు సుధాశ్రీ, బాలరాజు, జెడ్పీటీసీలు వెంకటేశ్వరమ్మ, విజయనిర్మల, ఏపీఎంలు సుదర్శన్, మాధవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, రమణారెడ్డి, సీసీలు, వీవోఏలు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.