మహబూబ్నగర్టౌన్, మార్చి 18 ;మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూలులో అధికారులు వేగం పెంచారు. వందశాతం ఆస్తిపన్ను వసూ లు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండడంతో సెలవు దినాల్లోనూ అధికారులు, సిబ్బంది ఆస్తిపన్ను వసూలులో నిమగ్నమవుతున్నారు.
ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా మహబూబ్నగర్ పురపాలికశాఖ అధికారులు చురుకుగా పనిచేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోడానికి సిబ్బంది, అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వందశాతం వసూలుపై దృష్టి సారించారు. మహబూబ్నగర్ పురపాలికలో మొత్తం 47,344 గృహాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.19.95కోట్లు ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ.15కోట్లకుపైగా ఆస్తిపన్ను వసూలైంది. ఇంకా రూ.4కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది. దాదాపు 80శాతానికిపైగా ఆస్తిపన్నును వసూలు చేశారు. ఆస్తిపన్ను వసూలుపై పట్టణంలో బ్యానర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఆటోలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను రూపొందించి ఫోన్లకు సమాచారం పంపిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లింపుపై స్పందించని యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా వందశాతం పన్ను వసూలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. సెలవు దినాల్లోనూ మున్సిపల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు.
మొండి బకాయిదారులకు నోటీసులు
ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాం. పట్టణంలో బ్యానర్ల ఏర్పాటుతోపాటు ఆటోలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. సెలవు దినాల్లో ఆస్తిపన్ను చెల్లించవచ్చు. ఇప్పటివరకు దాదాపు 80శాతం ఆస్తి పన్ను వసూలు చేశాం. 31వ తేదీలోగా వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తాం. పట్టణ ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి పుర అభివృద్ధికి సహకరించాలి.