కొల్లాపూర్ రూరల్, జనవరి 16 : సింగోటంలో ఏటా మకర సంక్రాంతి తర్వాత లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. రథోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు భారీగా తరలిరానున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తేరును ఆలయం కమిటీ చైర్మన్ ఆదిత్యలక్ష్మారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ద్ధన్రెడ్డి ప్రారంభించనున్నారు. భక్తులు శ్రీవారి సముద్రంలో పర్యటించేందుకు మరబోటులను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీని కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు సింగోటం చేరుకునేందుకు కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి డిపోలనుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.