కలెక్టర్ ఎస్ వెంకట్రావు
మహబూబ్నగర్, డిసెంబర్ 7: తప్పులు లేకుండా ఉద్యోగుల క్యాడర్ కేటాయించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపుపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేపథ్యంలో ఏ జిల్లాకు ఏ సిబ్బందిని కేటాయించాలన్నది ప్రభుత్వం స్పష్టంగా నిబంధనలు జారీ చేసిందన్నారు. ఈ నెల 6న 317జీవోను జారీ చేయడం జరిగిందని, ఉద్యోగుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, వితంతువు, వైద్య కారణాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. అధికారులు వారి పరిధిలో ఉమ్మడి జిల్లాలో పనిచేసే ప్రతి ఉద్యోగి నుంచి ఇచ్చికాలను తీసుకోవాలని, బుధవారం సాయంత్రంలోగా అన్ని క్రోడీకరించి ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్సైట్లో అఫ్లోడ్ చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల పరిధిలో సీనియార్టీ జాబితాను తయారు చేయాలని, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తప్పులు దొర్లకుండా పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. జేఏసీ ప్రతినిధి రాజీవ్రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ తరఫున రాజగోపాల్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారులు వారి సందేహాలను తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్ పవార్, సీతారామారావు, ఉద్యోగుల సంఘం నేతలు చెన్నకిష్టన్న, రాజేశ్, చందర్నాయక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సైనికులకు సహకారం అందించాలి
దేశం కోసం ప్రతిక్షణం పరితపిస్తూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన సైనికుల సంక్షేమానికి ప్రతిఒక్కరూ సహకారం అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ తనవంతుగా ఆర్థికసాయం అందజేశారు. ప్రతి కుటుంబం అండగా నిలబడి స్ఫూర్తినివ్వాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్పవార్, సీతారామారావు, సైనిక సంక్షేమ జిల్లా అధికారి వనజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.