నాగర్కర్నూల్, మే 17(నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాకముందు రోడ్లన్నీ దారుణంగా ఉండేవి. 2014కు ముందు కందనూలు నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ వాహనదారులు ఇప్పుడు కేవలం గంటలోనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అప్పట్లో కందనూలు నుంచి పాలమూరుకు వెళ్లాలంటే రెండున్నర గంటలు పట్టగా.. ఇప్పుడు గంటన్నరలోనే వెళ్తున్నారు. హైదరాబాద్కు అప్పట్లో 4గంటలు పడుతుండగా.. ఇప్పుడు మూడున్నర గంటల్లో చేరుకుంటున్నారు.
నాడు హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు గరిష్ఠ వేగం 40-50కిలోమీటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు 70-80కిలో మీటర్లకు చేరుకొంది. ఇలా ఏ ప్రాంతానికి చూసినా అరగంట నుంచి ముప్పావుగంట ప్రయాణ కాలం తగ్గడం హర్షణీయం. జిల్లాకేంద్రాలతోపాటు మండలాలు, గ్రామాలను కలిపే రోడ్ల అభివృద్ధే ఇందుకు కారణం. గతంలో విధులు సరిగ్గా నిర్వర్తించని డ్రైవర్లు, కండక్టర్లకు కోడేరు రూట్ను పనిష్మెంట్గా వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. నాగర్కర్నూల్-జడ్చర్ల రోడ్డును రూ.60కోట్లతో రెండు లేన్లతో చేపట్టారు.
కొల్లాపూర్ రోడ్డును రూ.48కోట్లతో, కల్వకుర్తి రోడ్డును రూ.17కోట్లతో అభివృద్ధి చేశారు. ఇక తెలకల్లి-కల్వకుర్తి రోడ్డును రూ.20కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చుతున్నారు. రూ.30కోట్లతో తీగలపల్లి-యాపట్ల రోడ్డును, కొల్లాపూర్-కల్వకోల్-కుడికిళ్ల రోడ్డును రూ.12కోట్లతో, రూ.9కోట్లతో కొల్లాపూర్ సోమశిల రోడ్డును, రూ.9కోట్లతో జమిస్తాపూర్-తెలకపల్లి రోడ్డును, రూ.30కోట్లతో సింగోటం-ఏదుట్ల రోడ్డును, రూ.27కోట్లతో నర్సాయపల్లి-నాగర్కర్నూల్ రోడ్డును, రూ.11కోట్లతో పెద్దకొత్తపల్లి-నాగుదేవులపల్లి రోడ్డును, రూ.5.25కోట్లతో మహదేవునిపేట రోడ్డు, రూ.5.25కోట్లతో అల్లీపూర్ రోడ్డును, చేగుంట గేట్ నుంచి రూ.5.25కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశారు. దేవునితిర్మలాపూర్-బావాయిపల్లి రోడ్డుకు రూ.6.90కోట్లు మంజూరయ్యాయి.
అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జీలు, కాజ్వేలు సైతం నిర్మించారు. నాగర్కర్నూల్ బస్ డిపో వద్ద బ్రిడ్జిని రూ.7.675కోట్లతో, పాలెంలో రూ.1.6కోట్లతో, రూ.3.20కోట్లతో బిజినేపల్లి వద్ద వంతెనలను నిర్మించారు. ఇక నాగర్కర్నూల్ నల్లవాగు బ్రిడ్జికి రూ.7.75కోట్లు మంజూరు కాగా.. బిజినేపల్లిలో నాలుగు నియోజకవర్గాలను కలిపే జంక్షన్ నిర్మాణానికి ఇటీ వలే రూ.6.50కోట్లు మంజూరయ్యాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చెన్నారం-నర్సాయపల్లిలో రోడ్డు పనులకు రూ.30కోట్లు మంజూరయ్యాయి. పెంట్లవెల్లి-మల్లేశ్వరంలో రూ.9.60కోట్లతో హైలెవల్ వంతెన, రూ.6.50కోట్లతో ముక్కిడిగుండం-మొలచింతలపల్లి వంతెన, రూ.4.50కోట్లతో మారేడుమాన్ పెద్దగుట్ట వద్ద, చుక్కాయపల్లి చాకలి మడుగుపై రూ.40లక్షలతో, కోడేరు-జనుంపల్లి మంత్రాలమ్మ వద్ద రూ.20కోట్లతో వంతెనల నిర్మాణం చేపట్టారు.
బస్సు వేగం పెరిగింది
నాగర్కర్నూల్-హైదరాబాద్ బస్సు పదేండ్ల కిందట గంటకు 40-50కిలోమీటర్ల వేగం దాటేది కాదు. ఇప్పుడు 70-80కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. హైదరాబాద్కు 2:45 నుంచి 3గంటల్లోనే చేరుకుంటున్నాం. కోడేరు రూట్ కూడా మెరుగైంది. నియోజకవర్గకేంద్రాలకు ప్రయాణం గంటలోపే ఉంటుంది. అప్పటి, ఇప్పటి రోడ్లకు చాలా తేడా ఉంది.
– బాలకిషన్, కండక్టర్