గద్వాల రూరల్, ఏప్రిల్ 18 : మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆ త్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టి ఆత్మకూర్లో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు శెట్టి ఆత్మకూర్కు చెందిన గుంటిపల్లి అంజిలన్న, లక్ష్మమ్మ కుమారుడు గుంటిపల్లి నవీన్(24) మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యే అదే మండలానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం కాగా ఈనెల 24వ తేదీన వివాహం చే యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా చురుకుగా ఉన్న నవీన్ బుధవారం హైదరాబాద్కు వెళ్లి వచ్చాడు. రాత్రి వాళ్ల చిన్నాన్న ఇంట్లో భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు.
తెల్లవారు జామున ఇంటి నుంచి బహిర్భూమికి బయటకు వచ్చి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లి న వారు చూసి వెంట నే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమారుడు విగతజీవి గా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేశాయి. విషయం తెలుసుకున్న రూరల్ స్టేషన్ పోలీసులు గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువకుడి ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.