నారాయణపేట గడ్డ ప్రగతికి కేరాఫ్గా మారింది. రూ.184.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ కార్యాలయం, మినీ ట్యాంక్బండ్, గ్రేటెడ్ మార్కెట్, సఖి సెంటర్, సీనియర్ సిటిజన్స్ పార్కు ప్రారంభంతోపాటుకలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజను మంగళవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేయనున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి నిమగ్నమయ్యారు.
నారాయణపేట, జనవరి 22: నారాయణపేట నియోజకవర్గంలో రూ.184.42కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయంతోపాటు జిల్లా కేంద్రంలో రూ.60.10కోట్లతో నిర్మించనున్న కలెక్టర్ కార్యాలయం, రూ.38.50కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీస్ కార్యాలయ కాంప్లెక్స్ భవనానికి, రూ.కోటితో నిర్మించనున్న సేవాలాల్ భవనం, రూ.56కోట్లతో ఏర్పాటు చేయనున్న అప్పక్పల్లి నుంచి కోయిల్కొండ వరకు డబుల్రోడ్డు పనులకు, రూ.2.90కోట్లతో నిర్మించనున్న నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.
అదేవిధంగా రూ.కోటితో నిర్మించనున్న ధోబీఘాట్, ధన్వాడ మండలకేంద్రంలో రూ.2.90కోట్లతో నిర్మించనున్న పోలీస్స్టేషన్ భవనానికి, ధన్వాడ మండలకేంద్రంలో రూ.కోటీ75లక్షలతో నిర్మించనున్న తాసిల్దార్ భవనం కాంప్లెక్స్, మరికల్ మండలకేంద్రంలో రూ.7కోట్లతో నిర్మించనున్న మండల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ.6కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు, రూ.47లక్షలతో నిర్మించిన సఖి సెంటర్ భవనానికి, రూ.4కోట్లతో నిర్మించిన కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్బండ్కు, రూ.80లక్షలతో నిర్మించిన సీనియర్ సిటిజన్పార్క్ను ప్రారంభించనున్నారు.
బహిరంగసభను జయప్రదం చేయాలి
మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు జిల్లాకేంద్రంలోని క్రీడామైదానంలో చేపట్టనున్న బహిరంగసభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలం నుంచి 10వేల మంది చొప్పున పార్టీ కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.