నారాయణపేట టౌన్, నవంబర్ 30 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడకుండా ప్రజలు మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగం వంటి స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కలెక్టర్ హరిచందన తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఒమిక్రాన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. జిల్లాలో మొదటి, రెండో డోసు టీకా తీసుకున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకొని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, రెండో డోస్ తీసుకొనే వారు షెడ్యూల్డ్ ప్రకారం తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వైద్యఆరోగ్యశాఖ అధికారి రామ్మనోహర్రావు, మండల ప్రత్యేక అధికారులు, పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.