మహబూబ్నగర్, ఫిబ్రవరి 3 : మనఊరు-మనబడి పనులను త్వరగా పూర్తిచేసి పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 291 పాఠశాలలను మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపిక చేయగా, మొదటి విడుతగా 32 పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు తెలిపారు.
వీటిలో 20 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. మిగిలిన పాఠశాలల పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండలానికి రెండు పాఠశాలలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కంటివెలుగు శిబిరాలపై ప్రజలకు అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 72వేల 975మందికి పరీక్షలు నిర్వహించి 9,780మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు వివరించారు.
మరో 7,620మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అలాగే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకుగానూ అర్హులైన రైతుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో 441 గ్రామపంచాయతీలను క్రీడాప్రాంగణాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో 333 గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేయగా, 249 క్రీడాప్రాంగణాలను పూర్తి చేసినట్లు తెలిపారు.
మిగతా వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్థలకొరత ఉంటే పాఠశాలల్లోనే క్రీడాప్రాంగణం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, కంటివెలుగు ప్రోగ్రాం అధికారి వినోద్, డీఎఫ్వో సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్నాయక్, ఆర్డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఉన్నారు.