అయిజ, ఫిబ్రవరి 18 : మన ఊరు – మన బడి పథకం కింద చేపట్టిన పాఠశాలల అదనపు భవనాలకు గత కొన్నేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో విసుగి వేసారిన కాంట్రాక్టర్ పాఠశాల అదనపు భవనానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామం లో చోటు చేసుకొన్నది. మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామం లోని జెడ్పీహెచ్ఎస్లో అదనపు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో రూ. 9 లక్షలు మంజూరు చేసింది. పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్ పనులు కొంత వరకు పూర్తి చేయగా ప్రభుత్వం రూ.7.50 లక్షలు చెల్లించిందని, మరో రూ.1.50 లక్షలు పెండింగ్ పెట్టడంతో బుధవారం పాఠశాలకు చేరుకొని అదనపు భవనం దగ్గర నిరసన తెలిపారు.
నాలుగేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని కాంట్రాక్టర్ రమేశ్ తెలిపారు. అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడులో రూ.9 లక్షలు, ఈడిగోనిపల్లి పాఠశాలలలో 3 మరుగుదొడ్లు రూ.6 లక్షలు, అలంపూర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో 3 అదనపు గదుల నిర్మాణాలను రూ.27లక్షలతో చేపట్టినా పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నతాండ్రపాడులోని అదనపు భవనంలో ల్యాబ్ నిర్వహిస్తున్నారు. అప్పటికే తాళం వేసి ఉంచిన భవనం ఎదుట కాంట్రాక్టర్ నిరసన తెలిపారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని పాఠశాల హెచ్ఎం హన్మంతు తెలిపారు.
ఈ విషయమై పంచాయతీ రాజ్ డీఈ వెంకట్రెడ్డి పాఠశాలకు చేరుకొని కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపు విషయమై విచారణ చేపట్టారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతోనే గత నాలుగేళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని డీఈ తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులు ఉపాధ్యాయులు నగదు జమ చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేసుకొని భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని, పెండింగ్ పనులు చేపట్టకున్నా మొత్తం బిల్లులలో ఆలస్యమైందని, పనులు చేపట్టకున్నా బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ అదనపు భవనం దగ్గర నిరసన తెలిపారని పేర్కొన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.