అచ్చంపేట, మార్చి 18 : వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకూ తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి. అందుకే రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో సాసర్పిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అరణ్యంలో జీవాలకు నీటిగోస తీర్చేందుకు అటవీశాఖ చర్యలు ప్రారంభించింది. వన్యప్రాణులకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో 701 వరకు సాసర్పిట్లు ఉన్నాయి. ట్యాంకర్ల సాయంతో వాటిని నీటితో నింపుతున్నారు. అలాగే సమీప ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటివనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో 25 సోలార్పంపుసెట్లు ఏర్పాటు చేశారు. అమ్రాబాద్ ఏరియాలో 420 సాసర్పిట్లు, అచ్చంపేట ఏరియాలో 281 నిర్మించారు. ఈ ఏడాది కొత్తగా మరో మూడు సోలార్ పంపుసెట్లు ఏర్పాటుకు బోర్ డ్రిల్లింగ్ చేయించేందుకు జియాలజిస్టును సంప్రదించారు.
మద్దిమడుగు, అమ్రాబాద్, మన్ననూర్, చారకొండ రేంజ్ పరిధిలో సోలార్ సాయంతో పనిచేసే బోర్లతో నీటి వసతి కల్పించారు. సహజ సిద్ధమైన నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో బోర్లు వేసి సోలార్ సాయంతో వాటిని నీటితో నింపుతున్నారు. వన్యప్రాణులకు అవసరమైన పచ్చికను సైతం పెంచుతున్నారు. నిండు వేసవిలో సైతం గ్రామాల్లోకి వన్యప్రాణులు తాగునీటి కోసం రాకుండా చర్యలు తీసుకున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజ ర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య, మాంసాహార జంతువుల సంఖ్య బాగా పెరిగిం ది. పెరిగిన సంఖ్యకు అనుగుణంగా ఆహారం, నీటి కొరత లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సాసర్పిట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జింకలు, దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు ఇతర శాకాహార, క్రూరజంతువుల రాకను గుర్తిస్తున్నారు.
వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు
వేసవిలో అడవిలో సహజంగా ఉండే నీటి వనరులు ఎండిపోతాయి. దీంతో వన్యప్రాణులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మొత్తం 701 సాసర్పిట్లు, 25 సోలార్ బోర్లు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల సాయంతో నీటితో నింపుతున్నాము. వన్యప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో అక్కడ వసతులు కల్పిస్తున్నాం. సాసర్పిట్ల వద్ద కెమెరాలు అమర్చాం. వేసవిలో వన్యప్రాణుల శరీరంలో ఉప్పుశాతం తగ్గుతుందని, అందుకే సాసర్పిట్ల వద్ద ఉప్పు, మట్టిని ముద్దగా చేసి పెడుతున్నాము. సాసర్పిట్ల వద్దకు రెగ్యులర్గా జంతువులు వచ్చి తాగునీరు తాగుతున్నాయి.
– రోహిత్గోపిడి, డీఎఫ్వో, నాగర్కర్నూల్