సాహసయాత్ర సలేశ్వరం జాతర ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు. వీరంతా శనివారం తెల్లవారుజామున తిరిగి రానున్నారు. చివరి రోజు లక్ష వరకు భక్తులు తరలిరాగా.. మూడ్రోజుల్లో మొత్తం 4 లక్షలకుపైగా భక్తులు లింగమయ్య స్వామిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలు, మోటర్సైకిళ్లు, బస్సుల్లో తరలివచ్చారు. అడవిలో కొద్ది దూరం వెళ్లాక వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన దర్శనానికి వెళ్లారు. కొండలు, కోనలు ఎక్కుతూ.. దిగుతూ.. రాళ్లూరప్పలను దాటుకుంటూ లోతట్టు లోయలోని స్వామిని దర్శించుకునేందుకు సాహసయాత్ర చేపట్టారు. గుండం వద్ద ప్రమాదకరంగా ఉన్న దారి మీదుగా చిన్నా, పెద్ద, వృద్ధులు సైతం లింగబేధం లేకుండా స్వామి సన్నిధికి చేరి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం కోసం గంటల తరబడి బారులుదీరారు. మదినిండా లింగమయ్యను కొలిచి తన్మయత్వం చెందారు. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. వెళ్లొస్తాం.. లింగమయ్యా.. అన్న నినాదాలతో నల్లమల పులకించింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అచ్చంపేట/లింగాల, ఏప్రిల్ 7 : తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర శుక్రవారంతో ముగిసింది. చైత్రపౌర్ణమిని పురస్కరించుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రారంభమైన జాతర మూడు రోజులపాటు భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు లింగమయ్యను దర్శించుకొని తన్మయత్వం చెందారు.
నల్లమల ప్రాంతమంతా భక్తుల శివనామస్మరణతో పులకించింది. చిన్న, పెద్ద, వృద్ధులు, లింగబేధం లేకుండా స్వామి సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. లింగాల నుంచి అప్పాయిపల్లి మీదుగా మన్ననూర్, వటువర్లపల్లి నుంచి ఫరహాబాద్ మీ దుగా ఆర్టీసీ బస్సులు, జీపులు, కార్లు, బైకుల ద్వారా భక్తుల రాకతో రహదారులన్నీ కిటకిటలాడాయి. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండా కోనల్లో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు మూడ్రోజులపాటు సుమారు 6 వేలకుపైగా వాహనాల్లో 4 లక్షల వరకు భక్తులు తరలివచ్చారు.
అయితే ట్రాఫిక్ జాంతో వాహనదారులు, తాగునీటి కోసం భక్తులు ఇబ్బందులుపడ్డారు. చివరి రోజు సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులు, వాహనాల సందడితో దా రులన్నీ సలేశ్వరానికే వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదానం, అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గుండం లోపల, బయట భక్తులను నిర్వాహకులు, పోలీసులు అదుపు చేశారు.
దట్టమైన అడవిలోకి వెళ్లాక వాహనాలను పార్కింగ్ చేసి అక్కడి నుంచి కాలినడకన వెళ్లారు. కొండలు, వంకలు ఎక్కుతూ.. దిగుతూ.. రాళ్లూరప్పలను దాటుకుంటూ లోతట్టు లోయలోని స్వామిని దర్శించుకునేందుకు సాహసయా త్ర చేపట్టారు. లోయలో గుండం వద్ద ప్రమాదకర దారి మీదుగా స్వామి సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు.
వె ళ్లొస్తాం.. లింగమయ్యా.. అన్న దైవనామంతో మన్యం మార్మోగింది. అటవీశాఖ అధికారులు డీసీఎం, లారీలకు రూ.వెయ్యి, ట్రాక్టర్కు రూ.500, త్రీవీలర్ వాహనాలకు రూ.300, బైకులకు రూ.100 చొప్పున టోల్గేట్ రుసుము వ సూలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు. వీరంతా స్వామి దర్శనం అనంతరం శనివారం తెల్లవారుజామున తిరిగి రానున్నారు.