పెబ్బేరు, జూన్ 29 : పెబ్బేరుకు సమీపంలో జాతీ య రహదారి-44 పై సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్టం మంత్రాలయం నుంచి తెల్లవారుజామున వనపర్తికి బయలు దేరింది. బస్సు రంగాపురం గ్రామం దాటి పెబ్బేరుకు చేరుకొనే లోపే ప్రమాదానికి గురై డివైడర్పై అడ్డంగా పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 61 మంది ప్రయాణికులు కుదుపులకు గురై ఒకరిపై ఒకరు పడిపోయి గాయాలపాలయ్యారు.
సీట్ల కింద ఇరుకున్న వారిని స్థానికులు వచ్చి అతికష్టం మీద బయటకు తీశారు. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగ్గొట్టుకొని బయటపడ్డారు. ప్రయాణికుల్లో 20మందికి పైగా బలమైన గాయాలు కాగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న శివరాంప్రసాద్ (59)కు గాయాలు కాగా కర్నూల్ దవాఖానలో చికిత్స పొందుతూ మృ తి చెందారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు, వనపర్తి, పెబ్బేరు, హైదరాబాద్ల్లోని ప్రైవేట్ దవాఖానలకు తరలించారు. మరో 20మందికి స్వల్ప గాయాలు కాగా వారు ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయారు.
బస్సు ప్రమాదానికి గురైన వెంటనే అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన వాహనాన్ని ఆపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్వయంగా బస్సులోకి వెళ్లి సీట్ల కింద ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని అంబులెన్స్లో ఎక్కించే వరకు ఆయ న అక్కడే సహాయక చర్యలను పర్యవేక్షించారు.