మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 13 : దసరా పండుగ కోసం ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 374 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. శుక్రవారం నుంచి 27వ తేదీ వరకు అదనపు బస్సులు నడవనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు దసరా పండుగకు వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లోనే ఎక్కువ ఆదాయం వస్తుండడంతో అదనపు సర్వీసులు కూడా ఎక్కువగానే నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో సైతం సాధారణ చార్జీలే వసూలు చేయనున్నారు. ము ఖ్యంగా అచ్చంపేట, తెల్కపల్లి, డిండి, గద్వాల, అయిజ, కల్వకుర్తి, ఆమన్గల్, కొల్లాపూర్, కోస్గి, మహబూబ్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, బిజినేపల్లి, నారాయణపేట, మద్దూర్, మరికల్, మక్తల్, షాద్నగర్, ఆరాంఘర్, వనపర్తి, ఘనపూర్, పెబ్బేర్, కొత్తకోట తదితర ప్రాంతాలకు ఆయా డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.
374 బస్సులు..
మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 9డిపోల నుంచి 374 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. మహబూబ్నగర్ 54, షాద్నగర్ 26, వనపర్తి 54, గద్వాల 46, నారాయణపేట 34,కొల్లాపూర్ 34,నాగర్కర్నూల్ 34, కల్వకుర్తి 46, అచ్చంపేట 46 డిపోల వారీగా అదనపు సర్వీసులు నడిపిస్తారు.
దసరా లక్కీ డ్రా..
దసరా పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి టీఎస్ ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30వ తేదీ వరకు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఆర్ఎస్ ఆర్టీసీ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఆ తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ వెనుకపేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్లలోని డ్రాప్ బాక్సుల్లో వేయాలని సూచించారు. ప్రతి రీజియన్ పరిధిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. డ్రా ద్వారా ఎంపిక చేసి రాష్ట్రవ్యాప్తంగా 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున రూ.11 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు.
దసరాకు ప్రత్యేక బస్సులు..
దసరాకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులు నపడిస్తున్నాం. రీజియన్ పరిధిలో 9డిపోల నుంచి 374 బస్సులు నడిపించేందుకు ఏర్పాటు చేశాం. దసరా పండుగను పురస్కరించుకొని ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30వ తేదీ వరకు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఆర్ఎస్ ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. ఆ తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ వెనుకపేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్లలోని డ్రాప్ బాక్సుల్లో వేయాలి. ప్రతి రీజియన్ పరిధిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తాం. రద్దీని బట్టీ మరిన్ని బస్సులు నడపడానికి తగిన చర్యలు తీసుకుంటాం.
-వి.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్నగర్