వంట గ్యాస్ కనెక్షన్లను త్వరగా అప్డేట్ చేసుకోవాలన్న పుకార్లను నమ్మిన వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నెలాఖరు వరకే గడువు ఉందని అసత్య ప్రచారాలు ఊపందుకోవడంతో బారులుదీరుతున్నారు. తెల్లవారకముందే గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వినియోగదారులు ఈ-కేవైసీ చేసుకోవాలని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయా కంపెనీల ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని, అప్డేట్కు చివరి తేదీ అంటూ ఏమీ ఉండదని సూచిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ-కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అప్డేట్ చేసుకోవాలంటున్నారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 13 : వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందని, ఈ కేవైసీ చేయించుకోవాలని తెల్లవారకముందే గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భరోసా పథకం కింద గ్యాస్ సిలిండర్ రూ.500లకే అందించేందుకు, ఈకేవైసీకి ఎలాంటి సంబంధం లేదని ఏజెన్సీ నిర్వాహకులు తేల్చి చెబుతున్నా ఒక్కసారిగా ఎగబడి వస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గ్యాస్ కంపెనీలు వినియోగారుల నుంచి వేలిముద్రలు తీసుకొని ఈకేవీసీ చేయాలని ఆయా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు ఆదేశించడం జరిగింది. ఈ విషయం సంబంధిత డీఎస్వో అధికారులకు కూడా సమాచారం లేదు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.500ల గ్యాస్ సిలిండర్ రావాలంటే ఈ కేవైసీ చేయించుకోవాలని సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో వినియోగదారులంతా ఏజెన్సీ కార్యాలయాల వద్ద బారులుతీరుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు ఈ కేవైసీకి ఎలాంటి తొందర లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చని సూచిస్తున్నారు.కేవైసీ చేసుకో వాలని నిబంధనలేమీలేవు.. గ్యాస్ ఏజెన్సీల వద్ద గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కేవైసీ, ఈకేవైసీ చేసుకోవాలని నిబంధనలేమీ లేవు. వీటిని చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయని ఎవరూ చెప్పలేదు. ఇందుకు సంబంధించిన ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. తొందరగా ఈ కేవైసీ చేసుకోవాలని దిగులు చెందాల్సిన అవసరం లేదు.
ఇప్పటికిప్పుడు ఈకేవైసీ చేసుకోవాలనేదేమీ లేదు. కేవైసీ, ఈకేవైసీ చేసుకోవాలి కానీ చివరి తేదీ అంటూ ఏమీ చెప్పలేదు. ఎప్పుడైనా చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. వినియోగదారులకు ఈ విషయం చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవచ్చు.