మహబూబ్నగర్, జూన్ 9 : ఇంటింటా సంక్షేమ సౌరభం వెల్లివిరు స్తున్నది. అన్ని వర్గాల బాగు కోసం పక్షపాతం లేకుండా పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవు డయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎనిమిదో రోజైన శుక్రవారం సంక్షేమ సంబురం కొనసాగింది. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పాలమూరులో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాలరాజు, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, హర్షవర్ధన్రెడ్డి, రాజేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, నరేందర్రెడ్డితోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. దీంతో గొల్లకురుమల్లో దరహాసం నెలకొన్నది. అలాగే బీసీ కులవృత్తిదారులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాయాన్ని అందించి ఆర్థిక భరోసానిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులిచ్చి మేమున్నామంటూ ధైర్యం ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ బ్యాండ్ కొట్టగా.. ఎమ్మెల్యే బీరం ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. గొర్రెల కాపరుల లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ, బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష విలువ గల చెక్కులు, మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి మంజూరైన 38 మందికి రూ.లక్ష, 14మందికి రూ.2లక్షల చొ ప్పున ఆర్థికసాయం, కులాంతర వివా హం చేసుకున్న వారికి రూ.2లక్షలు, 144 మంది లబ్ధిదారులకు సంఘిక సంక్షేమ శాఖ నుంచి ఇండ్ల పట్టాలు, 21 మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ.కోటి 14లక్షలు, 18గొర్రెల యూనిట్లను రెండో వి డుత కింద పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 540 మంది లబ్ధ్దిదారులకు రూ.5 కోట్ల 40లక్షల 640 విలువ గల చెక్కుల ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కేవలం రూ.200 పింఛన్ అందించేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త పింఛన్ రూ.2,016, 3,016లను అందిస్తుందన్నారు. కులవృత్తుల వారు ఎవరిపై ఆధారపడకుండా జీవన స్థితిగతులు మెరుగుపర్చుకునేలా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. పుట్టుక నుంచి మరణించే దాకా ఏదో రూపకంగా ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని కొనియాడారు. హరితహారం, పల్లె ప్రకృతివనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, ప్రతి ఊరికి ట్రాక్టర్ వంటివి ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన ఐటీ కారిడార్లో రానున్న కాలంలో అనేక పెద్ద కంపెనీలు వస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం ఫిష్ ఫెస్టివల్ సందర్భంగా శిల్పరామం వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. వంటకాలను రుచి చూశారు.
పాలమూరు యూనివర్సిటీ సమీపంలో రూ.1.75 కోట్లతో నిర్మించనున్న సైనిక సంక్షేమ భవనాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. సైనికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవినాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మూడా చైర్మన్ గంజి వెంకన్న, ఎంపీపీ సుధాశ్రీ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, మత్స్యశాఖ జిల్లా అధికారి రాధా రోహిణి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మైనార్టీ సంక్షేమ అధికారి టైటస్పాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.