మాగనూరు: మాగనూరు మండల కేంద్రంలోని కొత్త కాలనీ ( New colony ) లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (Praja Vani ) లో వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని కాలనీ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు.
1988లో అప్పటి ప్రభుత్వం 200కు పైగా కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించిందని ,అప్పటి నుంచి నేటి వరకు కాలనీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో విషపురుగులు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. గతంలో పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన కూడా చోటుచేసుకుందని వారు పేర్కొన్నారు. కాలనీలో విద్యుత్ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పుంజనూర్ ఆంజనేయులు, పాటిమీది వెంకటయ్య, టప్ప రమేష్, లంగటి శేఖర్, పుంజనూర్ మహదేవ్, ఆంజనేయులు, మారెప్ప రాజు, వాబయ్య తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.