అయిజ, జనవరి 8 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ఆర్డీఎస్ ప్రధానకాల్వకు చుక్కనీరు చేరలేదు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీటిని ఈనెల 5 నుంచి కర్ణాటకలోని ఎల్ఎల్సీ గుండ్లకేరీ ఎస్కేప్ల 4వేల క్యూసెక్కులను విడుదల చేస్తుండగా, ఆదివారం ఉదయం ఆనకట్టకు నీళ్లు చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సకాలంలో నీళ్లు చేరకపోతే పంటలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆనకట్టకు నీళ్లు చేరగానే పంటలకు విడుదల చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల సాగు, తాగునీటి అవసరాలకు డ్యాం ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నీటిమట్టం తగ్గుతున్నది. వేసవిలో తాగునీటి అవసరాలకు 20టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉందని టీబీ బోర్డు అధికారులు చెబుతున్నారు. శనివారం అవుట్ఫ్లో 10,051 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 27.345 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.