మహబూబ్నగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో విసిరేసినట్లు ఉండే పాలమూరు.. తెలంగాణ ఏర్పడ్డాక రూపురేఖలే మారిపోయాయి. టూరిజంశాఖ మంత్రి జిల్లాకు చెందడంతో నిధుల వరద పారుతున్నది. అధికారులు పాలమూరు సుందరీకరణపై దృష్టి సారించారు. అటవీ, మున్సిపల్, టూరిజం, రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పట్టణ రూపురేఖలు మారుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకోపార్కుకు పట్టణ శివారులో బీజం పడింది. రూ.7.40కోట్లతో 2,087ఎకరాల్లో పార్కులో వనాలను అభివృద్ధి చేస్తున్నారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ నుంచి జడ్చర్ల వరకు నాలుగులైన్ల రహదారి నిర్మాణం 90శాతం పూర్తయింది.
మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో రూ.10కోట్లతో ఏడు ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రెండు పూర్తయి ఐదు పురోగతిలో ఉన్నాయి. రూ.56.5కోట్లతో మినీ ట్యాంక్బండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో మినీ శిల్పారామం, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐల్యాండ్, నెక్లెస్రోడ్, పెద్దచెరువు విస్తరణ, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయి. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఉదండపూర్ రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను తీసుకొచ్చి పెద్ద చెరువును నింపుతారు. ఏడాదిపాటు స్వచ్ఛమైన నీరు నిల్వ ఉండేలా చేస్తున్నారు. పాత కలెక్టరేట్ వద్ద మల్టీఫ్లెక్స్ థియేటర్లు, బస్టాండ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించనున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు చుట్టపక్కల జిల్లాల ప్రజలు చలో పాలమూరు అనడం ఖాయమని అంటున్నారు.
రూ.56.5 కోట్లతో..
పాలమూరు జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ను రూ.56.5కోట్లతో నిర్మిస్తున్నారు. పనులన్నీ తుది దశకు చేరకున్నాయి. రూ.13కోట్లతో శిల్పారామం పనులు చేపట్టారు. ఇందులో పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకర వాతావరణం, పచ్చనిలాన్లు, కుర్చీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాలతో టూరిజంశాఖ ప్రత్యేక డిజైన్ చేయించింది. రూ.15కోట్లతో చెరువు మధ్యలో ఐలాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. సస్పెన్షన్ బ్రిడ్జికి కనెక్ట్ చేయబడే ఐలాండ్లో చుట్టూ పచ్చని లాన్లు, లేజర్లైటింగ్తోపాటు పాత విమానం నమూనాతో డిన్నర్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఐలాండ్లో పెద్ద మూన్ను ఏర్పాటు చేసి మూన్కింద డిన్నర్ చేసిన అనుభూతిని కల్పించబోతున్నారు. రూ.14కోట్లతో నిర్మించే కేబుల్ కం సస్పెన్షన్ బ్రిడ్జి పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇక మినీ ట్యాంక్బండ్ చుట్టూ ఏర్పాటుచేసే నెక్లెస్రోడ్డు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
యజ్ఞంలా అభివృద్ధి
పాలమూరు పట్టణాన్ని యజ్ఞంలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 20ఏండ్లపాటు నిరంతరంగా అభివృద్ధి చేస్తూ తెలంగాణలోనే నెంబర్వన్ నగరంగా తీర్చిదిద్దితాం. హైదరాబాద్ తరహాలో ఇక్కడే అన్ని వసతులు కల్పించి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెడికల్, ఎడ్యుకేషన్, ఐటీ హబ్ తయారు చేశాం. టెంపుల్ టూరిజం వైపు కూడా అభివృద్ధి చేస్తూ అన్ని మతాలకు గౌరవిస్తున్నాం.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి
హైదరాబాద్ తరహాలో..
పాలమూరు పట్టణంలోని పెద్ద పెద్ద మాల్స్ అందుబాటులోకి రా నున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలతోపాటు బ్రాండెడ్ కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. హైదరాబాద్లో దొరికే రేట్లకే బ్రాండెడ్ వస్తువులు, వస్ర్తాలు కొనుగోలు చేసే వెసలుబాటు ఉన్నది. మల్టీఫ్లెక్స్ తరహాలో సినిమా హాళ్లు, గేమింగ్జోన్లు ఉన్నాయి. ఇప్పటికే చెన్న య్ షాపింగ్మాల్, సీఎంఆర్, మలాబార్ గోల్డ్, మాక్స్, రిలియ న్స్, ట్రెండ్స్, క్రోమా కంపెనీ ఔట్లేట్లు మార్కెట్ను షేక్ చేస్తున్నా యి. నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.