మహబూబ్నగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు చినుకు రాలుతుండగా.. వరదై పారుతున్నది. చల్లని గాలులు వీస్తుండడంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రహదారులన్నీ చిత్తడిగా మారాయి. పలు చోట్ల పాత ఇండ్లు కూలిపడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు, నవాబ్పేట మండలం కాకర్లపహాడ్, సిద్ధోటం, యన్మన్గండ్లలో మూడు, నారాయణపేట జిల్లాలో ఇల్లు నేలమట్టమైంది. వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు, కుంటలు నిండాయి. కొన్ని చోట్ల అలుగులు పారుతున్నాయి. పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. ఇండ్లు కూలిపోవడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి ఆయా కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పాలమూరు, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేటలో మోస్తరు వర్షాలు పడుతుండగా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ముసురు పడుతున్నది.
జోరుగా పొలం పనులు
ముసురు వర్షాలు పడుతుండడంతో పంటలకు ప్రాణం వచ్చింది. ఈ సారి వర్షాలు ఆలస్యంగా రావడంతో కొన్ని ప్రాంతాల్లో మొలకలు ఎండిపోయే స్థితికి చేరాయి. ఇలాంటి సమయంలో మోస్తరు వానలతో కళకళలాడుతున్నాయి. రైతులు మెట్ట, వరి నాట్లు వేసే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కవర్లు కప్పుకొని మరీ వర్షాన్ని లెక్కచేకుండా పనులు చేస్తున్నారు. రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో ఉత్సాహంగా పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కరిగెట, నాట్లు, ఇతర పనులతో వ్యవసాయ క్షేత్రాలన్నీ సందడిగా మారాయి. కూలీలు పాటలు పడుతూ అలుపూ, సొలుపూ లేకుండా పనులు చేస్తున్నారు.
బాలానగర్లో అత్యధికం
కోస్గిలో 51మి.మీ. వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఇక్కడే పడింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరులో 50 మిల్లీమీటర్లు, బాలానగర్లో 46.8 మి.మీ., నారాయణపేట జిల్లా మద్దూరులో 15.2 మిల్లీమీటర్లు కురవగా. అత్యల్పంగా చారకొండలో 1.2 మి.మీ. కురిసింది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో అత్యధికంగా 14.8 మి.మీ., అత్యల్పంగా చారకొండలో 1.2 మి.మీ., వనపర్తి జిల్లా పెద్దమందడిలో అత్యధికంగా 22.3 మి.మీ., అత్యల్పంగా చిన్నంబావిలో 5.2 మి.మీ., జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా ఉండవెల్లిలో 15.6 మి.మీ., అత్యల్పం కేటీదొడ్డి, గట్టులో 2.4 మి.మీ. కురిసింది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 46.8 మి.మీ. వాన పడింది.
నారాయణపేటలో 32.8, గుండుమాల్ మండలం సల్కర్పేటలో 43.5 మి.మీ., మద్దూరులో 43.3మి.మీ., కొత్తపల్లి 40.5 మి.మీ., దామరగిద్ద 39.3మి.మీ., గుండుమాల్లో 35.8 మి.మీ., మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 34.5మి.మీ., మహమ్మాదాబాద్లో 31 మి.మీ., హన్వాడలో 30.0మి.మీ., కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్లో 29.5 మి.మీ., పారుపల్లిలో 25.2మి.మీ., మూసాపేట మండలం జానంపేటలో 22.5మి.మీ., పాలమూరులో కంట్రోల్ రూం ఏర్పాటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కోరారు. ఇటు రెవెన్యూ, అటు పోలీసు సిబ్బందిని అలెర్ట్గా ఉండాలని ఆదేశించారు. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మహబూబ్నగర్ జిల్లాలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 08542-241165 నంబర్కు సాయం కోసం కాల్స్ చేయాలని సూచించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తం చేశారు. చెరువులు,కుంటలు, రిజర్వాయర్లలో చేపలు పట్టకూడదని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు కలెక్టర్ రవినాయక్
వర్షం కారణంగా ఏర్పడే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. ఆస్తి, ప్రాణనష్టం వాటిళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 08542-241165 నెంబర్కు సమాచారం అందించాలని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఆయన సంబంధిత జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, తండాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యంపై దృష్టి సారించాలని, మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. తండాలు, గ్రామాల్లోని గర్భిణులను ముందుగానే గుర్తించి వారి ప్రసవానికి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. రహదారులపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఇతర ప్రాంతాల గుండా ట్రాఫిక్ను మళ్లించాలన్నారు. ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని, వాగులు, వంకలు పొంగిపొర్లే చోట, రహదారులపై నీరు ప్రవహించే చోటుకు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పోలీస్ అధికారులను ఆదేశించారు.