గద్వాల, జనవరి 25 : జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులు పండించి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారులపాలు కాకుండా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అయితే ఈ ఏడాది వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో 58 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వానకాలంలో ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకొని కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేయడంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారులు 58 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే రైతుల నుంచి 55కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీసీఎస్, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి పంట ఎక్కువగా సాగు చేశారు.
జిల్లాలో 55కొనుగోలు కేంద్రాల ద్వారా 24,534 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు కొనుగోలు చేశారు. సాగు అంచనాను బట్టి ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడి రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన 55కొనుగోలు కేంద్రాల ద్వారా 3,022మంది రైతుల నుంచి 24,534మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 3,022మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.41కోట్లు రైతుల ఖాతాలో జమచేశారు. కొనుగోళ్లు జరిగిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.