అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జన ప్రవాహం కదిలింది.. లక్షలాదిగా తరలిరాగా.. జన సునామీని తలపించింది.. యువత కేరింతలు.. బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలంతో సభాప్రాంగణాలు దద్దరిల్లాయి.. గుండెల నిండా గులాబీ జెండాతో ఉత్సాహం వెల్లువైంది.. గులాబీ బాస్ ప్రజా ఆశీర్వాద సభలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నిండింది.. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణాలు హోరెత్తాయి. దారులన్నీ కేసీఆర్ సభకే.. అన్నట్లుగా వాహనాలు బారులుదీరాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో జనసంద్రాన్ని తలపించాయి.. ప్రగతి ప్రదాత కేసీఆర్ను చూసేందుకు మిట్టమధ్యాహ్నం మండుటెండను సైతం లెక్కచేయకుండా రెండు గంటలు ఎదురుచూశారు.. అధినేత ప్రసంగానికి ఈలలు, హర్షధ్వానాలతో హోరెత్తించారు.. ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు.. సెల్ఫీలు.. వీడియోలను ఫోన్లలో చిత్రీకరించారు. గురువారం అచ్చంపేట, వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు ఉప్పెనలా జనం తరలివచ్చారు.. తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వం చేసిన ప్రగతి, సంక్షేమ పాలన వివరించిన తీరు ఆద్యంతం ఆకట్టుకోగా.. జనం జై కొట్టారు.. సబ్బండ వర్గాల ఆశీర్వాదం లభించగా.. గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొన్నది.
‘కేసీఆర్ నీకు దమ్ముందా..? గాంధీ బొమ్మకాడికి వస్తావా? అంటడొకడు.. కొడంగల్కు రా.. అంటాడింకొకడు.. నా ముందున్న ఈ ప్రజలే నా దమ్ము.. ఎన్నికలు వస్తుంటయి.. పో తుంటయి.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. మీకు దండం పెట్టి చెబుతున్నా.. ఇప్పుడు మీరు పోరాటం చేయాలి.. నాడు తెలంగాణ కోసం ఒక్కడ్నే వెళ్లా.. ఉద్యమంలో నిజాయితీ, దమ్ము ఉండడంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం.. కానీ గతంలో ఎవరు ఏ చేతికిందున్నడో తెలుసు.. ఇయ్యాల లేచినోడు, లెవ్వలేనోడు సైతం మాట్లాడుతుండ్రు.. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాం.. సంక్షేమ సౌరభాలు పూయించాం.. తలసరి ఆదాయంలో దేశంలోనే ముం దున్నాం.. గతంలో 60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి ఉంటే నేడు 3 కోట్ల టన్నులకు చేరి రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది.. ప్రజలు నిజానిజాలు గుర్తించాలి’..
గులాబీ దళం గర్జించింది.. జన ఉప్పెన తరలొచ్చింది.. దారులన్నీ సభా ప్రాంగణం వైపే.. యువతీ, యువకుల కేరింతలు, ఈలలతో హోరెత్తించారు.. గురువారం అచ్చంపేట, వనపర్తిలో పర్యటించిన అధినేత, సీఎం కేసీఆర్ సభ సమరోత్సాహాన్ని నింపింది. మంత్రి నిరంజన్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన రెండు సభలకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. గాయని మధుప్రియ, ఏపూరి సోమన్న, కొమ్ము లక్ష్మక్క ఆటపాటలతో ఆలరించారు. జనం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డ్యాన్స్లు చేస్తూ సందడి చేశారు.
* సభావేదికకు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3:15గంటల గంటలకు చేరుకున్నారు
* సీఎం ప్రసంగంతో సభాప్రాంగణం నినాదాలతో హోరెత్తింది.
* ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాటలను సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
* అచ్చంపేటకు పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల ఇవ్వాలని గువ్వల సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
* గువ్వల అడిగిన వాటికి సీఎం మంజూరు చేస్తానని ప్రకటించడంతో జనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.
* సీఎం కేసీఆర్ సాయంత్రం 3:24గంటలకు ప్రసంగం ప్రారంభించి 3:51గంటలకు ముగించారు.
* రామక్క పాట గువ్వలపై ఏపూరి సోమన్న పాడగా జనం ఈలలు వేస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
* పటాకులను గులాబీ రంగులో కాల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* సాయంత్రం 4:24గంటలకు హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ వనపర్తికి చేరుకున్నారు.
* హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి, నాయకులతో కలిసి 4:30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
* మంత్రి నిరంజన్రెడ్డి సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
* మంత్రి నిరంజన్రెడ్డి 4:33 నుంచి 4:45 గంటల వరకు మాట్లాడారు.
* 4:45 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించి 5:05 గంటలకు ముగించారు.
* సీఎం కేసీఆర్ 19:42 నిమిషాల పాటు ప్రసంగించారు.
* నాగం తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరిక
* 5:10 నిమిషాలకు సీఎం హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
* హెలీప్యాడ్ వద్ద మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో 5 నిమిషాలు సీఎం మాట్లాడారు.
* సింగర్ మధుప్రియ ఆటపాటకు నృత్యం చేసిన మహిళలు
* రాబంధు రాజ్యమా.. రైతుబంధు రాజ్యం కావాలా అనే నినాదంతో హోరెత్తిన జనం
* నిరంజన్ అన్నను గెలిపించుకుందామనే మాటకు పెల్లుబుకిన నినాదాలు
* సాయిచంద్కు జోహార్లు అర్పిస్తూ నినాదాలు, పాటలకు పెద్దఎత్తున జోహార్లు