సిలిండర్ ధర పెంపుపై నిరసనలు
మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, పలుచోట్ల ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు హాజరు
తరలివచ్చిన మహిళలు, ప్రజలు
బైబై మోదీ అంటూ నినాదాలు
మహబూబ్నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద్దతు తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 1100పైగా పైగ పెరగడం, దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మండిపోతున్నాయని సామాన్యులు బతికేదేట్ల మోడీ అంటూ ప్రశ్నించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్, అచ్చేదిన్ అంటూ అన్నిరకాల ధరలు పెంచి సామాన్యులు సచ్చేదిన్కు చేర్చారని మండిపడ్డారు. రోడ్లపై ఖాళీ గ్యాస్ సిలిండర్లను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రహదారులపై వంటావార్పు చేశారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో జరిగిన ఆందోళనలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి శ్రీనివాస్గౌడ్ కార్యకర్తలతో కలిసి పాల్లొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి జాతీయ రహదారిపై వంటావార్పు చేశారు. గద్వాల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ సరిత, అయిజలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వనపర్తిలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధర్నా సక్సెస్
మహబూబ్నగర్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి, పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. పాలమూరులోని తెలంగాణచౌరస్తాలో జరిగిన ఆందోళనలో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ గ్యాస్ సిలిండర్ను నెత్తిన పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినదించారు. నారాయణపేట జిల్లాకేంద్రంతోపాటు మక్తల్, నర్వ, మాగనూరు, కృష్ణా మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. మక్తల్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని రాస్తారోకో చేశారు. మాగనూరు వద్ద 167నెంబర్ జాతీయ రహదారిపై వంటవార్పు చేయడంతో పెద్దఎత్తున ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గద్వాల జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆందోళనలో జెడ్పీచైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ పాల్గొన్నారు. అయిజలోని రాయచూర్ రహదారిపై నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అబ్రహం హాజరై మాట్లాడారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో జరిగిన ఆందోళనలో జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న పాలమూరు
కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెద్దఎత్తున పెంచడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ నేతలు ఆందోళనలకు దిగారు. ఆందోళనల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ఇస్తున్న రూ.240ల సబ్సిడీని ఎత్తివేసి ధరలను పెంచిందని ఆరోపించారు. సామాన్యులపై నడ్డీ విరిచిందని, భవిష్యత్లో ధరలు ఎంత పెరుగుతాయో ఉహించడం కష్టమన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూలీనాలి చేసుకునేటోళ్లు సంపాదించిందంతా గ్యాస్, పెట్రోల్, డీజిల్కే పోతుందని, పూట గడవడం కష్టంగా మారిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తూ ఈడీ ద్వారా వేధిస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ఆందోళనలో మంత్రి పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదలకు చేసిందేమీలేదన్నారు. సంక్షేమం మరిచి మతంపేరుతో ప్రజలను రెచ్చగొట్టి హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని యువత బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఏవిధంగా ఉద్యమించామో ధరల పెరుగుదలపై అదేస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మరో పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. అవసరం అయితే ఢిల్లీని ముట్టడిస్తామన్నారు.