జోగులాంబ గద్వాల : జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలంటే భూసేకరణ ( Land acquisition ) ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్అండ్ ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్) కమిషనర్ శివకుమార్ నాయుడు( Commissioner Sivakumar Naidu ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణ పై కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి సంబంధిత అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో ఇంకా 541 ఎకరాల భూ సేకరణ నోటిఫికేషన్, సర్వేస్థాయిలో ఉందని, ప్రక్రియ పూర్తి చేస్తే ప్రభుత్వం నిర్వాసితులకు సత్వరమే డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు రిజర్వాయర్ నిర్మాణానికి ఇంకా 212 ఎకరాలు, గట్టు కుడి, ఎడమ కాలువలకు 249 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఆర్డీఎస్ పరిధిలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నందున రైతులకు గ్రామ సభలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, పీజేపీ సీఈ నాగేంద్రం, ఎస్ఈ రహీముద్దీన్, ఈ ఈ శ్రీనివాస్, సర్వే ఏడీ నూకరాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.