చెంతనే నదులు పారుతున్నా చుక్క నీటికి నోచుకోక ఉమ్మడి పాలమూరు జిల్లా కరువుతో తల్లడిల్లింది. భూములన్నీ నెర్రెలుబారి నోళ్లు తెరిచేవి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన స్వరాష్ట్రంలో కరువును శాశ్వతంగా తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నానికి పూనుకున్నారు. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. పీఆర్ఎల్ఐ పూర్తయితే తమ రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందన్న అక్కసుతో కాంగ్రెస్ నాయకులు కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా, సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకుసాగారు. రూ.52 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. పట్టుబట్టి మరీ కేంద్రం నుంచి పరిపాలనా అనుమతులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కృషిపై ఉమ్మడి జిల్లా అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను కృష్ణాజలాలు ముద్దాడనున్నాయి. డ్రైరన్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘పాలమూరు’ పూర్తయితే ఉమ్మడి జిల్లా కోనసీమను తలపించనున్నదని ఇంజినీర్లు, మేధావులు, రైతులు అభిప్రాయపడుతున్నారు.
– నాగర్కర్నూల్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్కు నీళ్లు చేరితే సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. చెరువులు, కుంటలు నింపితే భూగర్భజలాలు పెరుగనున్నాయి. వానలు కురవకున్నా.. బోర్ల నీటితో వ్యవసాయం చేసుకోవచ్చు. ప్రతి చేనుకు, చేతికి పని దొరుకుతుంది. కాగా, ఇప్పటికే ఎంజీకేఎల్ఐ నీరు పుష్కలంగా పారుతుండడంతో కరువు పోయి కాలంలో పడ్డాం. పుష్కలంగా పంటలు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ మమ్ములను చల్లగా చూసుకుంటున్నడు. ఎటు చూసినా నిండిన చెరువులు, కుంటలు, పచ్చని పైర్లే కనిపిస్తున్నాయి. పెట్టుబడి సాయంతో రైతులకు అప్పుల బాధ తీరింది. మంచి చేస్తున్న సర్కార్ను ఎప్పటికీ మరిచిపోం. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గుండమోని బుచ్చయ్య, పొల్కెపహాడ్, గోపాల్పేట మండలం, వనపర్తి జిల్లా
నాగర్కర్నూల్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : కరువుతో తల్లడిల్లిన పాలమూరును పీఆర్ఎల్ఐ కోనసీమలా మార్చనున్నది. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాలో బీడు బడిన భూములను పచ్చగా మార్చేందుకు ఎంజీకేఎల్ఐ, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. సాగునీరు అందని ప్రాంతాలకు పీఆర్ఎల్ఐ ద్వారా లబ్ధి చేకూర్చేలా పనులు చేపట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా 60రోజుల్లో 90టీఎంసీలను ఎత్తిపోసేలా రూపొందించారు. 2016లో సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుముర్తిరాయ, ఉదండాపూర్లో దాదాపు 65టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నింపుతారు. ఈ నీళ్లతో మహబూబ్నగర్ జిల్లాలోని 22మండలాల్లోని 402 గ్రామాల పరిధిలోని 3,96,273 ఎకరాలకు, నాగర్కర్నూల్లోని 8మండలాల్లోని 61గ్రామాల పరిధిలోని 1,03,389ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకూ నీళ్లు అందుతాయి. ఇలా ప్రాజెక్టుతో మొత్తం 12.30లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందనుంది. ఈ పనుల్లో భాగంగా అప్రోచ్ ఛానల్స్, ఓపెన్ కెనాల్స్, సొరంగాలు, ఐదు పంపు హౌస్లు, ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తుండగా ఇప్పటికే 80శాతం పనులు పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాలోని ఏదుల జలాశయం ఇప్పటికే పూర్తి కాగా నార్లాపూర్, వెంకటాద్రి రిజర్వాయర్లు 90శాతం పనులు జరిగాయి. పీఆర్ఎల్ఐ పనులపై కాంగ్రెస్తో పాటుగా అభివృద్ధి నిరోధకులు కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టించారు.
2021 ఆగస్టులో రెండో దశ అనుమతుల కోసం ప్రభుత్వం నివేదికలు సమర్పించినా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ సూచనలతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి మొదటి దశ అనుమతులను సాధించింది. ఆ తర్వాత కేసులు కొనసాగుతుండడంతో రెండో దశ పనులపై ప్రభావం పడింది. ఇలా కేసుల కుట్రలను దాటుకొని ఇటీవల రెండో దశ పర్యావరణ అనుమతులు సాధించడంతో ప్రాజెక్టు పనుల్లో జోష్ పెరగనుంది. సీఎం ఆదేశాలతో మొదటి లిఫ్టు నార్లాపూర్ నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు. దీనికోసం ఇంజినీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం జలాశయాల పరిధిలో 300 కేవీ సబ్స్టేషన్లను నిర్మించగా విద్యుత్ చార్జ్ ప్రక్రియ కూడా పూర్తైంది. రాబోయే రోజుల్లో డ్రైరన్ నిర్వహించనచున్నారు. ఇది విజయవంతమైతే సెప్టెంబర్ నాటికి నార్లాపూర్ జలాశయానికి నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభమవుతుంది. నార్లాపూర్, ఏదుల, వట్టెంలో రెండు మోటర్ల చొప్పున మొత్తం 6మోటర్లతో నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. పీఆర్ఎల్ఐ పనులకు అడ్డంకులు తొలగి ప్రారంభానికి సిద్ధమవుతుండడంతో రైతన్నలు, పాలమూరు ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్కు మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు రైతులతో కలిసి క్షీరాభిషేకాలు చేసి సంబురాలు నిర్వహించారు. పీఆర్ఎల్ఐ కోసం సీఎం చేస్తున్న కృషిని పాలకులతోపాటు ఇంజినీర్లు, మేధావులు సైతం ప్రశంసిస్తున్నారు.
సీఎం కేసీఆర్ వల్లే పాలమూరుకు అభివృద్ధి చేకూరుతున్నది. ఎంజీకేఎల్ఐతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించారు. కాంగ్రెస్, అభివృద్ధి నిరోధకులు వేసిన కేసులతోనే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగింది. పాలమూరు కరువును శాశ్వతంగా తీర్చే పీఆర్ఎల్ఐకి అడ్డంకులు తొలగించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో ఎంజీకేఎల్ఐకి దశాబ్దాలు పడితే అనతి కాలంలోనే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుంది.
– మర్రి జనార్దన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే