‘పాలమూరు’ స్వప్నం సాకారం కానున్నది. అడుగు దూరంలో అరవై ఏండ్ల కల నిలిచింది. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పుంజుకోనున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు చివరి దశలో ఉన్నాయి. కాంగ్రెస్ కుట్రలను ఛేదించి.. కోర్టుల్లో కేసులను వీడడంతో లైన్ క్లియర్ అయ్యింది. ఎట్టకేలకు పర్యావరణ అనుమతులు రావడంతో ఇక అన్ని అడ్డంకులను అధిగమించి పనులు జెట్ స్పీడ్తో కొనసాగనున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆనందహేల వ్యక్తమవుతున్నది శుక్రవారం కరివెన రిజర్వాయర్ వద్ద క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి జలాభిషేకం చేశారు. శనివారం ఏదుల రిజర్వాయర్ వద్ద రైతు సంబురం జరగనుండగా.. ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు.
– మహబూబ్నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జిల్లా వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ నగరాలకు తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్న అడ్డంకులన్నీ తొలగినట్లేనని ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా వివక్షకు గురైన పాలమూరుకు న్యాయం జరిగిందని రైతుసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి జిల్లాలో కృష్ణమ్మ బీడు భూములను తాకనున్నది. దీంతో జిల్లా రైతాంగం చిరకాల స్వ ప్నం నెరవేరుతుంది.
పాలమూరు బీళ్ల దాహార్తిని తీర్చే, ప్రజల తలరాతను మార్చే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి కరివెన రిజర్వాయర్పై సీఎం చిత్రపటానికి జలాభిషేకం చేసి ఆనకట్టకు పూజలు నిర్వహించారు. వర్షపు నీటితో జలకళను సంతరించుకున్న కరివెన జలాలకు గులాబీ పూలు చల్లి ఆనందం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలపై ఉన్న నమ్మకానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమిదని మంత్రి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఏదుల రిజర్వాయర్ వద్ద భారీ ఎత్తున రైతు సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంటనే శంకుస్థాపన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని బాహుబలి పంపుల ద్వారా రోజుకు ఒక టీఎంసీ పంపింగ్ చేసి వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు రిజర్వాయర్లను నింపి 12 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని సంకల్పించారు.
పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే తమ రాజకీయ మనుగడ కష్టమని భావించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకునేందుకు కుట్రపన్నారు. అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కోర్టులకు వెళ్లారు.. పర్యావరణ అనుమతులు లేవని గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా విధించేలా చేశారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు మర్రి, గువ్వల, బీరం, ఆల, లక్ష్మారెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పర్యావరణ అనుమతుల కోసం కోర్టుల చుట్టూ తిరిగారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పబలంతో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసి, తాగునీటి కోసం ఏడు టీఎంసీలు వాడుకునేలా అనుమతులిచ్చింది. దీంతో ఖంగుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ కుట్రలకు పాల్పడ్డారు. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి 49 సార్లు ఈఎన్సీ మీటింగ్లో ప్రభుత్వ వాదనలు విని పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. దీంతో ప్రతిపక్ష నేతల కుట్రలకు తెరపడింది. పర్యావరణ అనుమతులు సాధించడంతో పీఆర్ఎల్ఐ ట్రయల్ రన్ను నెలాఖరులోగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కరివెన రిజర్వాయర్పై జలాభిషేకం
పాలమూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పీఆర్ఎల్ఐకి పర్యావరణ అనుమతులు సాధించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల జలాభిషేకం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ను సందర్శించి పూజలు చేశారు. ఇప్పటికే వర్షాలతో రిజర్వాయర్లో సుమారు ఒక టీఎంసీ నీరు చేరగా ఆ జలాలకు పూజలు చేసి గులాబీ పూలు చల్లారు. కరివేన రిజర్వాయర్ నిండితే మూడు నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని, ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా నారాయణపేట జిల్లాకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆనందంతో మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి కరివెన రిజర్వాయర్పై విజయ సంకేతం చూపించారు.
నేడు ‘ఏదుల’పై రైతు సంబురాలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నిండే తొలి రిజర్వాయర్ ఏదుల వద్ద శనివారం రైతు సంబురాలు నిర్వహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు మంత్రి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ ఎత్తున రైతులను సమీకరించి విజయోత్సవాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యేలు సూచించారు.
వచ్చే నెలలో ట్రయల్ రన్
శ్రీశైలం జలాశయంలో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతుండడంతో నెలాఖరులో లేదా వచ్చే నెల లో నీటిని పంపింగ్ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈమేరకు 400 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. పంపింగ్ హౌస్లో బాహుబలి పంపులను కూడా ఏర్పాటు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపింగ్ చేసి రిజర్వాయర్లకు మళ్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. పీఆర్ఎల్ఐ స్వప్నం సాకారం అవుతుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.