ప్రజల ఆరోగ్యానికి దోహదం చేసే చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. సీఎం కేసీఆర్ మత్స్య ఉత్పత్తులపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని పూర్తి చేసేందుకు ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఈ ఏడాది టార్గెట్ 2.40 కోట్ల చేపపిల్లలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు వరద రాగా ఎత్తిపోతలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందించే చేపపిల్లల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,017 చెరువులు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. టెండర్లు పూర్తి చేయగా.. 26 నుంచి అందించేందుకు కసరత్తు చేపట్టారు. మొత్తం 139 మత్స్య సహకార సంఘాలు ఉండగా 11,621 మంది సభ్యులుగా ఉన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో ఆర్థికాభివృద్ధి సాధించనున్నట్లు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి అర్బన్, ఆగస్టు 24 : మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీలి విప్లవానికి శ్రీ కారం చుట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిష న్ కాకతీయతో పూడికతీత పనులు చేపట్టడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించకున్నాయి. దీంతో అటు రైతులకు పంట సాగుకు, మత్స్యకారులకు చేపల పెంపకానికి అనువుగా మారి మత్స్యకారులకు జీవనోపాధి లభించింది. నాడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేపలు దొరికే పరిస్థితి ఉండేది కానీ నేడు రాష్ట్రంలోని ఏ మారు పల్లెల్లో చూసినా నిరంతరం చేపలు దొరికే పరిస్థితికి నెలకొంది.
జిల్లాలోని ప్రాజెక్టులు ఎగువ కురిసిన వర్షాలకు, కెనాల్ కాల్వల ద్వారా నీటి విడుదల వల్ల గ్రామాల్లోని చె రువులు, కుంటలు, నిండుకుండలా మారాయి. పుష్కలం గా నీరు రావడంతో ఇటు రైతులు, అటు మత్స్యకారుల్లో సంతోషం నెలకొన్నది. నీటి వనరులు ఉన్న చోట చేపపిల్లల పెంపకానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు సన్నాహా లు చేపట్టారు. గతేడాది 2.20కోట్ల చేపపిల్లలను చెరువులు, కుంటల్లో వదలగా, ఈ ఏడాది 2.4కోట్ల పిల్లల పెం పకమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుబాటులో ఉన్న చెరువుల్లో వీటిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
టెండర్లు పూర్తి
చేపల పెంపకానికి జిల్లాలో అందుబాటులో ఉన్న 1,017 చెరువులు అనువైనవిగా గుర్తించారు. ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు ఈనెల 26న పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అన్ని మండలాల్లో కలిపి139 మత్స్యకార సహకార సంఘాలు ఉండగా అందులో 11,621 వేల మంది సభ్యులు ఉన్నారు. గతేడాది మత్స్యసంపద సమృద్ధిగా పెరగడంతో చెరువుల సమీప గ్రామాల్లో చేపలు కిలో రూ.100 నుంచి 150 వరకు దొరకగా, నల్ల చేపలు కిలోకు రూ.350 నుంచి 400 వరకు లభించాయి. జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లలను తెచ్చి విడిచి పెట్టేందుకు ప్రభుత్వ పరంగా టెండర్లను పిలిచారు. వాటిలో ఏడుమంది పాల్గొన్నారు. టెండర్లలో పాల్గొన్న వారి ఫిష్ సీడ్ కేంద్రాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కలెక్టర్కు నివేదికను అందజేశారు.
ప్రభుత్వ ప్రోత్సాహం..
మత్స్యకారులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందిస్తోంది. వాటిని పెంచేందుకు ఉచితంగా దాణా, వలలు, చేపలను అందిస్తూ రవాణా కోసం బైక్లు, ఆటోలను అందించింది. సంచార చేపల విక్రయ వాహనాలకు 60శాతం , బైక్లను 75 శాతం రాయితీపై అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మత్స్యకారులు మృతి చెందితే వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించి భరోసా కల్పిస్తోంది.