బాలానగర్, ఫిబ్రవరి 3 : మండలంలోని గుండేడ్ గ్రామ సమీపంలోని మహవీర్ కంపెనీ నుంచి వెదజల్లుతున్న పొల్యూషన్ నుంచి తమను కాపాడాలని గ్రామస్తులతోపాటు కార్మికులు పరిశ్రమ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పరిశ్రమ నుంచి కలుషిత నీరు రావడంతో బోర్లు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నామన్నారు. నీరు నలుపు రంగులో వస్తుండటంతో ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా గ్రామం పొగతో నిండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడే వాయు కాలుష్యం కారణంగా అరకిలోమీటర్ దూరంలో ఉన్న మరో పరిశ్రమలో పనిచేసే 500మంది కార్మికులు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.
6 నెలలుగా పరిశ్రమ నుంచి దట్టమైన పొగ వస్తున్నదన్నారు. పలు మార్లు ఆందోళన చేపట్టినా యాజమాన్యం స్పందించడం లేదని గ్రామస్తులు వాపోయారు. పలుమార్లు కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా మొక్కుబడిగా కాలుష్య నియంత్రణ అధికారులు పరిశ్రమకు వచ్చే ముందు వారికి సమాచారం ఇచ్చి, జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం సదరు కంపెనీ నుంచి మండలకేంద్రానికి గ్రామస్తులు ర్యాలీగా వెళ్లి మహవీర్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాసిల్దార్ శ్రీనివాసులు, ఏఎస్సై శ్రీనివాసులుకు వినతిపత్రాలు అందజేశారు.
మహవీర్ కంపెనీ వెదజల్లే కాలుష్యం కారణంగా నీరు నల్లగా మారుతున్నది. పొల్లాలోని బోర్లలో నీరు రాపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.. కూరగాయలు నల్లగా ఉండటంతో తినలేకపోతున్నం. ఈ పరిశ్రమ వల్ల మా ఊరంతా నల్లగా మారుతుంది. మా ఊరు, పొలాలను తీసుకొని మాకు వేరేచోట వసతి కల్పించాలి. లేదంటే పరిశ్రమను మూసివేయాలి.
– పవన్, గ్రామస్తుడు, గుండేడ్