అచ్చంపేట, మే 28 : ఈ ప్రాంతంలోని యువతీయువకులు, మహిళలు వివిధ రంగాల్లో రాణించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శాశ్వతంగా భవనం నిర్మాణం చేయించి నిరంతరం కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గువ్వల బా లరాజు అన్నారు. అచ్చంపేటలోని షామ్స్ ఫంక్షన్హాల్లో జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉద్యోగాల సాధనకు కొనసాగుతున్న శిక్షణా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఫ్యాకల్టీ బోధిస్తున్న తీరు, వసతులు, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అచ్చంపేట ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఏదైన కోచింగ్, ఇతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు శాశ్వత భవనాలు లేక ఫంక్షన్హాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఫంక్షన్హాల్స్లో శుభకార్యాలు ఉంటే కోచింగ్ బంద్ పెట్టాల్సి పరిస్థితి ఉందన్నారు. దీంతో శిక్షణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కింద శాశ్వత భవనం ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. జిన్కుంట కనకాల మై సమ్మ ఆలయంలో ప్రశాంతమైన వాతావరణంలో స్కిల్డెవలప్మెంట్ భవనం, నిరంతరం అన్నదానం, అనాథాశ్రమం, అవసరమైతే పీహెచ్సీ ఏర్పాటుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. తాను మాటకు కట్టుబడి ఉంటానని, నిజాయితీ, నిక్కచ్చిగా వ్యవహరిస్తానని చెప్పారు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొని వచ్చాన ని, తాను రోజుకూ 3-4 గంటల కంటే ఎక్కువ నిద్రపోనన్నారు. నిరంతరం అచ్చంపేట అభివృద్ధి కోసమే ఆలోచిస్తానని చెప్పారు. క్రీడలు అంటే ఇష్టమని, అందుకే ప్రతిరోజు ఎన్ని పనులున్నా 2-3 గంటలు మైదానంలో గడుపుతానని అన్నారు. తాను ఇప్పటికీ వందమీటర్లు 13 సెకండ్లలో పూర్తి చేస్తానని తెలిపారు. తన జీవితం ప్రజాసేవకు అంకితం చేశానని చెప్పారు. లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చానన్నారు. ఏ పని చేసినా విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే విజయం సాధ్యమన్నారు. యువతీ యువకులు పట్టుదల, కసితో చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు.