మహబూబ్నగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, ఎమ్మెల్సీ గో రటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పా లమూరుకే చెందిన యువ కవి, రచయిత తగుళ్ల గోపాల్కు యువసాహిత్య పురస్కారం లభించింది. వీరిద్దరికి పురస్కారం లభించడంపై పాలమూరు వా సులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోరటి వెంకన్న రాసిన వల్లంకి తాళం, తగుళ్ల గోపాల్ రచించిన దండకడియం కవితాసంపుటికి అవార్డులు దక్కాయి. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన ఇద్దరూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారే కావడం జిల్లాకే గర్వకారణమని సాహితీవేత్తలు కొనియాడుతున్నారు. అవార్డులు రావడంతో పాలమూరు జిల్లా పులకరించిపోతున్నదని పాలమూరు సాహితీ అధ్యక్షుడు డా.భీంపల్లి శ్రీకాంత్ గురువారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
పాలమూరు మట్టి పరిమళం..
1963లో నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌ రారం గ్రామంలో గోరటి వెంకన్న జన్మించారు. చిన్నప్పటి నుంచి పాటలంటే ఆయనకు ప్రాణం. ప్రకృతి, సామాజిక సమస్యలపై సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అ నేక పాటలు రాశారు. దుందుభి నదీతీరాన పుట్టి పెరిగిన వెంకన్నకు పల్లె ప్రజల సమస్యలు, జీవన విధానమే పాటలుగా మారాయి. సినిమాల్లోని ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి కన్నీరు పెడుతుం దో కనిపించని కుట్రల.., జై బోలో.. జై బోలో.. అమరవీరులకు జై బోలో..’ వంటి ఎన్నో పాటలు ఇప్పటికీ మర్చిపోలేని విధంగా నిలిచిపోయాయి. సంత, కొంగ, తుమ్మచెట్టు వంటి నిత్య జీవితంలో కనిపించే అంశాలపైనా పాటలు రాశారు. సంత మా ఊరి సంత లాంటి జానపదాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన రాసిన పాటలు ‘ధూంధాం’ వేదికలపై మార్మోగాయి. తెలంగాణ పోరాటంలో పాటకు ఎంత ప్రత్యేకత ఉందో చెప్పేందుకు గోరటి వెంకన్న జానపదాలే ఉదాహరణ. సుప్రసిద్ధ కవి, గాయకుడైన వెంకన్నను సీఎం కేసీఆర్ సముచిత రీతిలో సత్కరించారు. ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు.
గొర్రెల కాపరుల బిడ్డ..
కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారానికి ఎంపికైన తగుళ్ల గోపాల్ పాత మహబూబ్నగర్ జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా) మాడ్గుల మండలం కలకొండలో జన్మించారు. గోపాల్ చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి కృష్ణయ్య మరణించాడు. తల్లి ఎల్లమ్మ కూలీ పనిచేసి పోషించింది. తండ్రి బతికున్నప్పుడు ఆరో తరగతిలోనే చదువు మాన్పించి గాసం పెట్టాడు. పశువుల కాపరిగా ఉన్న గోపాల్ను టీచర్ రాజవర్ధన్రెడ్డి మళ్లీ బడిలో చేర్పించారు. ‘ఆ రోజు రాజవర్ధన్రెడ్డి సర్ నన్ను బడిలో వేయకుంటే ఇప్పుడు పశువుల కాపరిగానో, కూలీ పని చేస్తూనో ఉండేవాడిని’ అని గోపాల్ ఎన్నో సార్లు చెబుతుంటాడు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. గొర్రెల కాపరులు, సామాజిక వృత్తులు, ప్రాచీన వస్తువులపై రాసిన ‘దండ కడియం’ కవితా సంపుటితో యువ పురస్కారానికి ఎంపికకావడం సంతోషంగా ఉందని గోపాల్ తెలిపారు. ఇది పాలమూరు శ్రమ జీవితానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ కవితా సంపుటితో మర్చిపోయిన వృత్తులను తట్టిలేపినట్లు గుర్తు చేశారు. ఇంతకుముందు తీరొక్కపువ్వు పేరిట నానీలు రచించానని, పాలమూరు సాహితీ పురస్కారం 2019, కొత్తపల్లి నరేందర్ బాబు, తెలంగాణ సారస్వత, రొట్టమాకురేవు పురస్కారాలు లభించాయన్నారు. కృష్ణయ్య ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపురం యూపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు.