గద్వాల, జూలై 7 : గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అవగాహన లోపంతో పిడుగుపాటుకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించక పోవడంతో ప్రతి ఏటా జిల్లాలోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తొలకరి ప్రారంభం కాగానే పొలం పనులు ప్రారంభిస్తారు. వర్షం కురుస్తున్నప్పుడు పొలం పనులు, ఇతర వ్యవసాయ పనులు చేసేవారు, గొర్రెల కాపరులు తల దాచుకోవడానికి చెట్లు, రేకుల షెడ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి వారే ఎక్కువగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా పిడుగుపాటుకు గురై గతేడాది ఆగస్టు నెలలో వారంలో ముగ్గురితోపాటు కాడెద్దులు మృతి చెందాయి. 3వ తేదీన సంగాల గ్రామానికి చెందిన ఆంజనేయులు తన పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మరుసటి రోజే మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై రైతు (రవి) మృతిచెందగా ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈక్రమంలో కాడెద్దులు కూడా మృతి చెందాయి. అదేరోజు గద్వాల మండలం బసల్చెరువు గ్రామానికి చెందిన విద్యార్థి శశిధర్ తమ పొలం వద్ద ఉండగా వర్షం రావడంతో చెట్టుకిందకు వెళ్లాడు. ఈక్రమంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఏడాది జూన్ 22న మానవపాడు మండలం బోరవెల్లి గ్రామానికి చెందిన రామకృష్ణనాయుడు పొలం వద్ద పిడుగుపాటుకు గురై మరణించారు. ఆదివారం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన నాగరాజు, రంగస్వామి గొర్రెలు మేపుతూ పిడుగుపాటుకు గురై.. నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా రంగాస్వామి తీవ్రగాయాలతో జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గట్టు మండలం ఆలూరులో పిడుగుపాటుకు కాడెద్దు మృతి చెందింది. అవగాహన లోపం వల్లే ఇలా జరుగుతున్నదని.. అధికారులు ప్రజలకు పిడుగుపాటుపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది.