పెబ్బేరు బల్దియా పన్ను వసూళ్లల్లో టాప్ లేపింది. ఈ ఏడాది రూ.71.11 లక్షలకుగానూ రూ.49.52 లక్షలు వసూలయ్యాయి. ముందు వరుసలో కోరుట్ల, నారాయణఖేడ్, లక్సెట్టిపేట ఉండగా.. దీంతో 77.6 శాతంతో ఉమ్మడి జిల్లాలో మొదటి.. రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా అన్ని పురపాలక సంఘాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. పన్నులు చెల్లించే విషయంలో ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు సైతం తీసుకున్నారు. దీంతో ఈ ఘనతతోపాటు మంచి పురోగతిని సాధించి గుర్తింపు పొందింది.
– పెబ్బేరు, ఫిబ్రవరి 22
పెబ్బేరు, ఫిబ్రవరి 22 : పన్నుల వసూళ్లలో మంచి పురోగతి సాధిస్తూ పెబ్బేరు బల్దియా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల జాబితాను ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో పెబ్బేరు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నది. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఏడాదికిగానూ 77.6 శాతం ఇంటి పన్నులు వసూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నది. రాష్ట్ర స్థాయి పన్నుల వసూళ్లలో కోరుట్ల, నారాయణఖేడ్, లక్సెట్టిపేట మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పెబ్బేరు మున్సిపాలిటీలో రూ.71.11 లక్షల పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ.49.52 లక్షలు వసూలు చేసినట్లు హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ఆధారంగా స్పష్టమవుతున్నది. మూడేండ్ల నుంచి వరుసగా పెబ్బేరు మున్సిపాలిటీ ముందంజలో కొనసాగుతూనే ఉండడం గమనార్హం. 2020-21లో 74.36 శాతం, 2021-22లో 75.42 శాతం పన్ను వసూళ్లు చేసి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలిచింది. పన్నులు చెల్లించేందుకుగానూ ప్రజల్లో అవగాహన కల్పించడం, వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈ ఘనత సాధించినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక దృష్టి వల్లే సాధ్యం..
అభివృద్ధి పనులతోపాటు పన్నుల వసూళ్లపై పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఈ ఘనత దక్కింది. పన్నుల వసూలు కోసం సిబ్బంది ఎక్కువ సమయం కేటాయించడం, ప్రజల్లో అవగాహన కలిగించడం, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి వల్ల పురోగతి సాధించాం.అభివృద్ధే గీటురాయిగా పన్నులు వసూలవుతున్నాయి.
– ఎద్దుల కరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్, పెబ్బేరు
ప్రజల సహకారం ఎంతో ఉన్నది..
పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల అందిస్తున్న సహకారం ఎంతో ఉన్నది. చాలా మంది అడగకముందే విధిగా కార్యాలయానికి వచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. గ్రామపంచాయతీగా కొ నసాగిన కాలం నుంచి పన్నుల వసూళ్లలో పెబ్బేరు ఇదే ఒరవడి కొనసాగి స్తున్నది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నా లుగో స్థానాన్ని దక్కించుకోవడం పా లకవర్గ పనితీరుకు నిదర్శనం.
– మేకల కర్రెస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్