తెలంగాణ ట్యాగ్లైన్లో మూడోదైన ఉద్యోగాల నియామకాల కల శరవేగంగా సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెలలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా శనివారం గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 86,988 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు మూసివేయనున్నారు. బూట్లు, బెల్టులు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించగా.. ఐడీ కార్డులు, హాల్ టికెట్లు ఉంటేనే అనుమతించను న్నారు. సీసీ నిఘాలో పకడ్బందీ నిర్వహణకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
– నాగర్కర్నూల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రతి విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం. తెలంగాణ సాధనలో మూడోదైన ఉద్యోగాల నియామకాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలను నిర్వహించి దాదాపుగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నది. గత నెలలో గ్రూప్-1 ఎగ్జామ్ పూర్తవగా.. జూలై 1న గ్రూప్-4 ఉద్యోగాలకు రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు కొన్ని నెలలుగా రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. గ్రూప్స్ పరీక్షలకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత సిద్ధమయ్యారు. రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహించి 8,180 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నిరుద్యోగులు వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఏర్పాట్లను పూర్తి చేశారు.
రెండు పేపర్లుగా..
జంబ్లింగ్ పద్ధతిలో రెండు పేపర్లుగా పరీక్షను నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుండగా.. ఉదయం 8:30 గంటల నుంచి 9: 45 గంటల వర కు అనుమతినిస్తారు. అలాగే పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సా యంత్రం 5 గంటల వరకు నిర్వహించనుండగా.. 1:30 నుంచి 2:15 గంటల వరకే అనుమతిస్తారు. ఇలా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యే 15 నిమిషాల ముందే గేట్లను మూసివేయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లు, ఏదైనా గుర్తింపు కార్డులను తీసుకురావాలి. బూట్లు, బెల్టులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నిషేధించారు. కేంద్రంలోకి ప్రవేశించే అభ్యర్థులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయనున్నారు. పరీక్షలను టీఎస్పీఎస్సీ బోర్డు ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నది. ఇందుకోసం కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించారు.
ఇద్దరు అభ్యర్థుల సమక్షంలో కెమెరాల రికార్డుతో ప్రశ్నా పత్రాలను తెరిచి, సంతకాలు తీసుకోనున్నారు. కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నీచర్ వంటి వసతులు కల్పించనున్నారు. ఇక దివ్యాంగుల అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా కింది ఫ్లోర్లోని గదుల్లో నెంబర్లు వేయనున్నారు. ఇక పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలన్నీ మూసివేయించేలా నిర్వాహకులకు ఇప్పటికే పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులను నియమించారు. ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు శాఖ ప్రతి పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు చర్యలు ఏర్పాటు చేయనున్నది. మొత్తం మీద నిరుద్యోగుల ఉద్యోగ కలను సాకారం చేసే గ్రూప్-4 పరీక్షకు ఇటు అభ్యర్థులతో పాటు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
గ్రూప్-4 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులను గంట ముందుగానే కేంద్రం వద్దకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమయ్యే 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తారు. జిల్లాలో 50 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 16,637 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రాల్లో మంచినీరు, కరెంట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసు శాఖ సహకారంతో బందోబస్తు నిర్వహిస్తున్నాం.