నవాబ్పేట, మార్చి 12 : మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండలకేంద్రానికి చెందిన పంచాయతీ కార్మికులు మూడు, నాలుగు రోజుల కిందట విధులు బహిష్కరించారు. దీంతో మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ పడకేయగా.. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో 124 మంది ఉండగా, మండల కేంద్రంలో 16 మంది పంచాయతీ కార్మికులున్నారు. ఇందులో సగం మంది కామాటీలు, మరికొంత మంది స్వీపర్లు ఉన్నారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు ప్రతిరోజూ 12 గంటలపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా నూతన ప్ర భుత్వం ఏర్పాటైన తర్వాత వారికి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. కార్మికులు పొట్ట గడవక ప నులు బహిష్కరించి, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా నవాబ్పేట పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి చెత్త సేకరించే ట్రా క్టర్ కదలడం లేదు. గ్రామస్తులు, వ్యాపారులు చెత్తను జీపీ భవనం వద్ద పడేసి వెళ్తున్నారు. చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకపోవడంతో దుర్గందం వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. కాగా, మిగతా గ్రామాల్లో కూడా కార్మికులకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి జీతమైనా నెలనెలా ఇస్తే బాగుంటుందని, లేదంటే తాము కూడా విధులు బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఎంపీవో బద్రునాయక్ను వివరణ కోరగా.. కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు అందని మాట వాస్తవమేనని తెలిపారు. నాలుగు రోజుల కిందట నవాబ్పేటలో కార్మికులు విధులు బహిష్కరించిన విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకెళ్లి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన వివరించారు.