మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 14 : ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్నగర్.. నేడు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్నగర్ను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
ఫ్రెంచ్ మోటర్ సైక్లిస్ట్ ఆలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ వేదిక ద్వారా ఫ్రాన్స్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్, థా యిలాండ్కు చెందిన 8 మంది బైక్రైడర్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న యాత్రను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంత రం వారితోపాటు బైక్ రైడింగ్ చేశారు. బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హ్యాండ్ ఫౌంటేన్ కూ డలి వద్ద ఫొటో దిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక అవకాశాలు అందిస్తూ అసాధారణమైన మోటర్ సైక్లింగ్ అనుభవాలను కల్పించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఫ్రీడబ్ల్యూ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదన్నారు.
మహిళలు, పురుషులు అనే వివక్ష లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తె లంగాణ, మహబూబ్నగర్ విదేశీ స్వర్గధామంగా మారిందన్నారు. రైడర్లు అలిసన్ గ్రున్, సడ్రైన్, ఆస్లీ, జనెల్లి, జువేనా, స్టాసి, లారీ, సిగ్రిడ్, రచన బైక్ రైడింగ్ ద్వారా మహబూబ్నగర్, వికారాబాద్, నిర్మల్, వరంగల్, పోచంపల్లి మీదుగా హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. ఎనిమిది మంది బైక్రైడర్లు 9 రోజులపాటు బతుకమ్మ సంబురాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శించడంతోపాటు కళాకారులు, చేనేత కార్మికులను కలుస్తారన్నారు. ఈ పర్యటనకు హైదరాబాద్కు చెందిన మోవో సంస్థ ఫౌండర్ జైభారతి మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. మహబూబ్నగర్లో జంగల్ సఫారీ, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, శిల్పారామం, నెక్లెస్రోడ్డు, ట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, మన్యంకొండ ఆలయం సహా అనేక పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయని విదేశీ మహిళా బైక్ రైడర్లు పేర్కొన్నారు.
స్త్రీ శక్తి అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరణ..
మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 14 : ఈ నెల 17న తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్ హాల్లో ని ర్వహించనున్న 6వ ఎడిషన్ స్త్రీ శక్తి అవార్డ్స్కు సం బంధించిన పోస్టర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి విడుదల చేశారు. దేశంలోని వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన మహిళలకు ఈ అవార్డు అందజేయడంపై అభినందనలు తెలిపారు.
పాటల సీడీ ఆవిష్కరణ..
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిపై రూరల్ మండలం మాచన్పల్లి గ్రామానికి చెందిన రవి స్వయంగా రచించి పాడిన ‘తల్లి లాంటి పల్లె.. ఒడిని కాపాడగా కదిలెరా’ పాటల సీడీని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం గాయకుడు రవిని మంత్రి అభినందించారు.