వనపర్తి, సెప్టెంబర్ 22 : పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన ఒలియదాసరి గోవిందమ్మ నెత్తిన మూటతో గ్రామగ్రామాన తిరుగుతూ చీరలు విక్రయించేది. వచ్చిన చాలీచాలని డబ్బులతో ఇద్దరు దివ్యాంగులైన కొడుకులను చూసుకునేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల దశ మార్చేందుకు ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ ఆమెకు ఆదెరువు కల్పించింది. గోవిందమ్మ పరిస్థితిని కార్యకర్తల ద్వారా తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆమెకు పథకాన్ని అమలయ్యేలా చేశారు. వంద శాతం సబ్సిడీపై వచ్చిన రూ.పది లక్షలలో.. రూ.6 లక్షలతో టాటా ఏసీ వాహనం కొనుగోలు చేసింది. మిగిలిన డబ్బులతో గృహోపకరణ వస్తువులు, చీరలు, ఇతర వస్తువులను సమకూర్చుకొని వాహనంలోనే మినీ సూపర్మార్కెట్ ఏర్పాటు చేసుకున్నది. సొంతంగా వాహనాన్ని నడుపుతూ.. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జాతర్లలో 8 నెలలపాటు.., మిగిలిన నాలుగు నెలల్లో సంతలు, గ్రామాలకు తిరుగుతూ వస్తువులను విక్రయిస్తున్నది. తినడానికి కూడా డబ్బులు లేని స్థితి నుంచి నేడు మూడు పూటలా కడుపునిండా తినేస్థాయికి చేరింది. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి లబ్ధిదారురాలు కృతజ్ఞతలు తెలుపుతున్నది.
నెత్తిన చీరల మూటలు పెట్టుకుని గ్రామ గ్రామాన తిరుగుతూ వచ్చిన డబ్బులతో చాలీచాలని జీవితాన్ని నెట్టుకొస్తున్న ఓ మహిళకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం వరంగా మారింది. దళితబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులతో వాహనం, గృహోకరణ వస్తువులు, చీరలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ దర్జాగా బతుకుతున్నది.
మారిన గోవిందమ్మ జీవితం..
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన ఒలియదాసరి గోవిందమ్మ నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలి వెళ్లిపోయాడు. ముగ్గురు మగపిల్లలు ఉండగా, ఇందులో ఇద్దరు దివ్యాంగులు కాగా, మరో కుమారుడితో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేది. పిల్లలను పోషించుకోవడం కోసం నెత్తిన బట్టల మూట పెట్టుకుని గ్రామగ్రామాన తిరుగుతూ వ్యాపారం చేసుకునేది. డ్రైవింగ్ నేర్చుకొని చిన్నపాటి వాహనం తీసుకుంటే వ్యాపారం మంచిగా సాగుతుందని బంధువుల సలహా మేరకు డ్రైవింగ్ను నేర్చుకున్నది. దళితబంధు పథకం ప్రారంభం కావడంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో గోవిందమ్మ పరిస్థితిని గమనించిన స్థానిక నాయకులు ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పథకం అమలయ్యేలా ప్రత్యేక చొరవను తీసుకున్నారు.
దళితబంధు పథకానికి ఎంపిక కావడంతో రూ.10లక్షలు మంజూరయ్యాయి. 2022 ఏప్రిల్ నెలలో గోవిందమ్మ రూ.6లక్షలతో టాటా ఏసీ వాహనంతో పాటు మిగిలిన డబ్బులతో గృహోపకరణ వస్తువులు, చీరలు, ఇ తర వస్తువులను కొనుగోలు చేసుకున్నది. ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న వాహనాన్ని మంత్రి నిరంజన్రెడ్డి గోవిందమ్మ ఇంటికి వెళ్లి మరీ ప్రారంభించారు. వాహనాన్ని గోవిందమ్మ డ్రైవింగ్ చేయగా.. మంత్రి వాహనంలో కూ ర్చొని కొద్దిదూరం వెళ్లడంతో లబ్ధిదారుల కుటుంబీకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వాహనంలో అన్ని రకాల సౌకర్యాలను ఏ ర్పాటు చేసుకొని అన్ని వస్తువులు దొరికేలా సూపర్ మార్కెట్లా తయారు చేసుకున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధాన జాతర్లలో 8నెలలు పాటు ఉంటూ, మిగిలిన నాలుగు నెలల్లో శని, ఆదివారాలు పెబ్బేరు, వ నపర్తి మండలాల్లో జరిగే సంతలకు, మిగిలిన రో జుల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యాపారం చేస్తున్నది.
ఇంతటి మార్పు కలలో కూడా ఊహించలేదు..
నా భర్త వదిలి వెళ్లిన తర్వాత పిల్లలను పోషించుకొనేందుకు ఎంతో ఇబ్బందులు పడ్డా. నెత్తిన బట్టల మూటలను పెట్టుకుని ఊరూరా తిరిగి వచ్చిన డబ్బులతో గడిపేవాళ్లం. ఊహించని విధంగా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక చొరవతో దళితబంధు పథకం వచ్చింది. టాటా ఏసీ వాహనం కొనుగోలు చేసి అందులోనే షాపులాగా మార్చుకొని నా కొడుకు శోభన్తో కలిసి వ్యాపారం చేసుకుంటున్నా. గ తంలో తిండిలేక, నీళ్లు లేకపోయినా పొట్టకూటి కోసం కాలినడకన ఊరూరా తిరగక తప్పలేదు. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి సారోళ్ల వల్ల వ్యాపారం చేసుకొని నా పిల్లలను మంచిగా చూసుకుంటున్నా.
– ఒలియా దాసరి గోవిందమ్మ,దళితబంధు లబ్దిదారురాలు, పెబ్బేరు