జడ్చర్లటౌన్, జనవరి 6 : జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకున్న ది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి త మిళనాడు వెళ్తున్న ఐరన్లోడ్ లారీ జడ్చర్ల పట్టణ శివారులో టైరు పగిలి రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ క్రమంలో వరంగల్ నుంచి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామానికి గొర్రెల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో బొలెరో డ్రైవర్ శేఖర్(35) అక్కడికక్కడే మృతి చెందగా అందులో ఉన్న నిడుగుర్తికి చెందిన రాములు, నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గుర్తించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్న 30 గొర్రెలు కూడా మృతి చెందాయి. జడ్చర్ల పోలీసులు ప్రమా ద స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.