మహబూబ్నగర్, సెప్టెంబర్ 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా కరువును పారదోలుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుదిక్కులా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. సీఎం పర్యటన సందర్భంగా బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. ఈ ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ఏండ్ల తరబడి కేసులు వేస్తూ రైతుల ఆశలను ప్రతిపక్ష పార్టీల నాయకులు నిర్వీర్యం చేశారన్నారు.
ఉమ్మడి పాలమూరులోని ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్ పీఆర్ఎల్ఐని ప్రారంభిస్తారని, ఆయనకు స్వాగతం పలికేందుకు రైతులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి కలశాల ద్వారా కృష్ణానీటిని అందిస్తామని, వాటిని ఆయా గ్రా మాల చెరువులో చల్లడమే కాకుండా ఆలయాల్లో విగ్రహాలకు జలాభిషేకం చేయాలన్నారు. ప్రజలు భారీగా తరలివచ్చేందుకు ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా ఈ ఎత్తిపోతల వల్ల కలిగే లాభాలను వివరించాలన్నారు. ప్రతి బస్సుకు ఒక బ్యా నర్ ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో కలెక్టర్ రవినాయక్, అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఆర్డీవో యాదయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఎంపీపీలు సుధాశ్రీ, బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
596మందికి పరిహారం చెల్లించాలి
మహబూబ్నగర్ నుంచి కోస్గి, చించోలి రహదారి పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్అండ్బీ, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో మంత్రి మాట్లాడుతూ 167జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 596మంది బ్యాంక్ ఖాతాలను రేపటి వరకు సేకరించి తక్షణమే నష్టపరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు పాలకొండ బైపాస్ నుంచి బండమీదిపల్లి వరకు నిర్మించే రహదారి పనులను ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. బండమీదిపల్లి, పాలమూరు విశ్వవిద్యాలయం, వీరన్నపేట, డంపింగ్యార్డు, చిన్నదర్పల్లి వరకు నిర్మించే పనులను సైతం ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేయాలని జాతీయ రహదారుల సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ రహదారికి ఇప్పటి జాతీయ రహదారి అనుసంధానంగా ఉండడం, భారత్మాల రహదారి అనుసంధానంగా ఉండడం, మహబూబ్నగర్ పట్టణ మీదుగా వెళ్తుండడం ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 2 లేన్ల రహదారి మంజూరైనందున చిన్నదర్పల్లి హన్వాడ వరకు నాలుగు లేన్ల రహదారికి అసరమైన నిధుల కోసం అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. మహబూబ్నగర్ నుంచి కోస్గి-చించోలి రహదారి నిర్మాణం సందర్భంగా చిన్నదర్పల్లి, నాయినోనిపల్లి, హన్వాడలో ఇండ్లు, స్థలాలు, మసీదులు, దేవాలయాలు, దర్గాలు కోల్పోతున్న దృష్ట్యా జాతీయ రహదారి అధికారులు తక్షణమే ఆ గ్రామాలు సందర్శించి బాధితులతో మాట్లాడి రోడ్డు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ రవి మాట్లాడు తూ 167వ జాతీయ రహదారి నిర్మాణం 5 మండలాలలోని 17 గ్రామాల మీదుగా నిర్మితమవుతుందని, ఈ రోడ్డుకు సంబంధించిన 3ఏ నోటిఫికేషన్ ఇచ్చామని, సర్వే కూడా నిర్వహించామని తెలిపారు. మంత్రి సమావేశానికి కంటే ముందుగా కలెక్టర్ పలు అంశాలను ప్రస్తావించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జాతీయ రహదారి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేశ్, డిప్యూటీ ఇంజినీర్ రమేశ్బాబు, జీఎం దివాకర్రెడ్డి, టీఎం లీడ ర్ శీనయ్య, మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఉన్నారు.
ప్రజలను ఆదుకోవడమే లక్ష్యం
ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎక్సైజ్,క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం మహబూబ్నగర్ రూరల్ మండలం ఫతేపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కావలి బాలరాజు, రవి, ఆంజనేయులు, గణేశ్, కృష్ణయ్య, కాశీం, కోస్గి రవి సహ 50మంది నా యకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.