ఆయిల్పాం.. మంచి ఆదాయాన్నిచ్చే పంట. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటగా గుర్తింపు పొందింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటకూడా.. అందుకే తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులు ఆర్థికంగా ఎదగడానికి మొక్కలను ఉచితంగా ఇవ్వడంతోపాటు ఎకరాకూ అంతర పంటల సాగుకు రూ.2,100, ఆయిల్పాం తోటల యాజమాన్యం కోసం మొత్తం రూ.4,200
అందిస్తున్నది. దీంతో కర్షకులు తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఎకరానికి రూ.4,200 చొప్పున అందజేస్తున్నది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాకు ఇచ్చిన లక్ష్యం వంద శాతం పూర్తయింది. ముందు వరుసలో నిలబడి మిగితా జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. దీంతో జిల్లా ఆయిల్పాంకు అడ్డాగా మారింది.
వనపర్తి, ఫిబ్రవరి 5: తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసి రైతుల పక్షాన నిలబడింది. గతంలో వనపర్తి జిల్లాలో కృష్ణాజలాలు పారుతున్నా పట్టించుకునే వారులేక పంట పొలాలు బీటలుబారాయి. స్వరాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో చెరువులు, కుంటల్లో కృష్ణాజలాలను నింపడంతో వ్యవసాయం పండుగగా మారింది.
గతంలో ఇండ్లు, పొలాలను వదిలి వలసలు వెళ్లిన వారు తిరిగి సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. నీటి వనరులు ఎక్కువ కావడంతో ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయడంతో దిగుబడి తగ్గుతుంది. దీంతో రైతులు పంట మార్పిడి చేసున్నారు. ఇంకో అడుగు ముందుకేసి లాభాలసాగు ఆయిల్పాం తోటల పెంపకంపై మొగ్గుచూపుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి మొక్కలను ఉచితంగా ఇవ్వడంతోపాటు ఎకరాకు అంతర పంటల కోసం రూ.2100, ఆయిల్పాం మొక్కల యాజమాన్యం కోసం మొత్తం రూ. 4200 ఇవ్వడం వల్ల రైతులు ముందుకొచ్చారు.
వందశాతం లక్ష్యం పూర్తి
వనపర్తి జిల్లాలో ఆయిల్పాం తోటల పెంపకానికి మూడు వేల ఎకరాల లక్ష్యం ఇవ్వగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ప్రత్యేక చొరవ, సమీక్షలు, సమావేశాల ద్వారా జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ అధికారులతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో 3,284ఎకరాలకు రైతులు డీడీలను (ఒక్కో మొక్కకు రూ.20చొప్పున) చెల్లించడంతో ఇచ్చిన టార్గెట్ను పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. 853మంది రైతులకు అశ్వరావుపేట, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు 14విడుతల్లో జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో తీసుకెళ్లి తోటల పెంపకం, సాగువిధానం తదితర అంశాలను వివరించడంతోపాటు జిల్లాలోని రైతువేదికల్లో రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించారు. దీంతో జిల్లాకు ఇచ్చిన టార్గెట్ను పూర్తిచేసి వనపర్తి జిల్లా ముందు వరుసలో ఉందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొక్కలు నాటే విధానం
ఆయిల్పాం మొక్కలను రెండు విధాలుగా నాటడం జరుగుతుంది. చతురస్రం విధానంలో ఎకరాకు 50మొక్కలు, త్రిభుజాకారంలో ఎకరాకు 57మొక్కలను నాటుతారు. ఒక్కో మొక్కకూ రూ.193 చొప్పున ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం, మొక్కలకు పర్యావరణ నష్టం జరిగితే ఇబ్బందులు తలెత్తొద్దని ఒక్కో మొక్కకూ రూ.20చొప్పున డీడీ రూపంలో ప్రభుత్వం తీసుకున్న డబ్బులను రైతులకు చెల్లించడం జరుగుతుందని అధికారులు వివరించారు.
రైతులకు ఆదాయం ఇలా..
తోటల పెంపకంలో భాగంగా వరి మినహా అంతర్ పంట లు ఏమైనా వేసుకోవచ్చు. దీంతో ఆయిల్పాం తోటలవల్ల వచ్చే దిగుబడితోపాటు అంతర్ పంటల ద్వారా దిగుబడి రావడంతో రైతులకు మరింత ఆదాయం వస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత గెలలు కాస్తాయి. ఈ సమయంలో ఎకరాకు 4 నుంచి 6టన్నుల దిగుబడి వస్తుంది. ఏడేండ్ల తర్వాత ఎకరాకు 10నుంచి 16టన్నుల దిగుబడి వస్తుందని, వచ్చిన దిగుబడిని ఫ్యాక్టరీ జోన్ (వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్కు కలిపి) ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం(ఎస్సీ, ఎస్టీలకు)వందశాతం, ఓబీసీ ఐదెకరాలలోపు వారికి 80శాతం, ఆపై రైతులకు 70శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.
17ఎకరాల్లో సాగు చేశాను
ప్రభుత్వం ఉద్యాన వన శాఖ సహకారంతో 70 శాతం సబ్సిడిపై అందజేసిన ఆయిల్ పాం మొక్కలను 17 ఎకరాల్లో 850 మొక్కలను నాటాం. మొక్కలు నాటి 6 నెలలు అవుతుంది. బాగున్నాయి. మొక్కలకు డ్రిప్ ద్వారా నీళ్లను అందిస్తున్నాను. అంతర్ పంటలు కూడా సాగు చేస్తున్నాను. రైతులు ఆయిల్పాం సాగుపై మక్కువ చూపుతున్నారు.
– శ్రీనివాసరావు, రైతు, పొల్కెపహాడ్
వందశాతం టార్గెట్ పూర్తిచేస్తాం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రత్యేక చొరవను కనబరిచారు. 853 మంది రైతులకు అశ్వరావుపేట, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు 14 విడుతల్లో జిలా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కోసం అక్కడికి తీసుకెళ్లి తోటల పెంపకం, పంట పండించే విధానం, దిగుబడి ఎలా వస్తుంది ఎలా చేయాలి వంటి అంశాలను సైతం వివరించడం వల్లనే 100 శాతం టార్గెట్ పూర్తయింది.
– సురేశ్, ఉద్యానవనశాఖ అధికారి, వనపర్తి