అయిజ, మే 10 : రైతులు పండించిన ఆయిల్ పాం గెలలను టీజీ ఆయిల్ సీడ్ కంపెనీ సేకరిస్తోంది. అయిజ మండలంతోపాటు వడ్డేపల్లి, రాజోళి, గట్టు, మల్దకల్ తదితర మండలాలకు చెందిన ఆయిల్ పాం తోటల పెంపకం దారుల నుంచి ఆయిల్ పామ్ గెలలు సేకరణ జరుగుతోంది. జిల్లాలోని 13మండలాల్లో ఆయిల్ పాం తోటల రైతుల నుంచి గెలలు సేకరించి సిద్దిపేటలోని ఆయిల్ కంపెనీకి తరలిస్తున్నారు. ప్రతి వారం దాదాపు 250మెట్రిక్ టన్నుల ఆయిల్ పాం గెలల సేకరణ జరుగుతోంది.
అయిజ పట్టణం, బీచుపల్లి మిల్లుతోపాటు గోనుపాడులోని ఆయిల్ పాం గెలలను సేకరిస్తున్నారు. సేకరించిన గెలలను గతంలో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు ఆయిల్ ఫెడ్ అధికారులు తరలించేవారు. ప్రస్తుతం సిద్దిపేటలో కొత్తగా ఆయిల్ పాం ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో అక్కడికి తరలిస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ డీఎం శివనాగిరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆయిల్ పాం తోటల పెంపకంపై రైతులు ఆసక్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆయిల్ పాం తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను చైతన్యం చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆయిల్ పాం తోటల సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.