గద్వాల రూరల్, ఏప్రిల్ 12 : విగ్రహాలకు బదులు విజ్ఞానకేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి బస్తీనుంచి ఒక అంబేద్కర్ను తయారు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన పండుగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేఎస్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు కృషి చేయాలన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇలాంటి పండుగలను నిర్వహించుకొని అందరితో అంబేద్కర్ ఆలోచనా విధానాలను పంచుకోవడం శుభపరిణామమన్నారు. ప్రతి ఇంట్లో లైబ్రరీని ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చాలామంది తన వద్దకు వచ్చి అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు సహాయం కోరుతున్నారని.. అందుకు బదులుగా విజ్ఞాన మందిరాలు ఏర్పాటు చేసుకోవాలని.. అందుకు అవసరమైన డబ్బులు కూలి పని చేసైనా ఇస్తానని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఓయూ ప్రొఫెసర్ ఖాసీం సూచించారు. కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సం ఘం అధ్యక్షుడు ప్రకాశ్, ఉదయ్కిరణ్, మోహన్, ఆశన్న, యేసన్న, జాన్, రాములు తదితరులు పాల్గొన్నారు.